విద్యాపురి ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో మహేంద్ర, రాజేంద్ర అనే విద్యార్థులు చదువుతుండేవారు. ఆ తరగతిలోని 40 మంది విద్యార్థులలో ఎప్పుడూ మహేంద్ర క్లాస్ ఫస్ట్, రాజేంద్ర క్లాస్ సెకండ్ ర్యాంక్ వచ్చేవారు. మహేంద్ర అజాతశత్రువు. అతడు అందరితో స్నేహంగా ఉండేవాడు. రాజేంద్రకు మహేంద్ర పట్ల ఈర్ష్యాభావం. మహేంద్రను శత్రువుగానే చూసేవాడు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు, క్విజ్ , వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, పాటల పోటీలు, ప్రతిభా పరీక్షలు తదితరములు జరుగుతున్నాయి. ఆరోజు అన్ని సబ్జెక్టుల్లో కలిపి 300 మార్కులకు ప్రతిభా పరీక్ష. ఆ పోటీలో ఫస్ట్ వచ్చిన వారికి వెయ్యి రూపాయలు బహుకరిస్తామని ఒక స్వచ్ఛంద సంస్థ వారు ప్రకటించారు. ఈసారి ఎలాగైనా మహేంద్రను ఓడించి, తానే వెయ్యి రూపాయలు గెలవాలని రాజేంద్ర పట్టుదలతో ఉన్నాడు. పోటీ పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభం.
పోటీ పరీక్ష రోజు రానే వచ్చింది. అందరూ బడికి వచ్చారు. మహేంద్ర సమయానికి రాలేదు. మహేంద్ర కోసం ఎదురుచూస్తున్నారు ఉపాధ్యాయులు. కానీ ఎంతసేపటికి రావడం లేదు. “ఇంకా ఎందుకు ఆలస్యం? పోటీ పరీక్ష తొందరగా ప్రారంభించండి.” అని ఒకటే నస పెడుతున్నాడు రాజేంద్ర. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో మహేంద్ర లేకున్నా పరీక్ష నిర్వహించారు. మహేంద్ర ఆరోజు మధ్యాహ్నం పాఠశాలకు వచ్చాడు. మహేంద్ర కోసం ప్రత్యేకంగా పరీక్ష పెడతామన్నారు ఉపాధ్యాయులు. రాజేంద్ర ఒప్పుకోలేదు. “వాడు ఏమైనా విఐపినా? పరీక్ష అంటే సమయానికి రావాలి. వాడు వచ్చినప్పుడు పరీక్ష పెట్టడం ఏమిటి? వాడికి పరీక్ష నిర్వహించడానికి వీల్లేదు.” అని మొండిగా మాట్లాడాడు రాజేంద్ర. మహేంద్ర తనకోసం ప్రత్యేకంగా పరీక్ష పెట్టవద్దని ఉపాధ్యాయులతో చెప్పాడు.
ఆరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాక జరిగిన విషయం తెలిసింది. రాజేంద్ర తమ్ముడు సురేంద్ర పాఠశాలకు వెళ్తుంటే అతనికి రోడ్డు ప్రమాదంలో బాగా దెబ్బలు తగిలాయని, పాఠశాలకు వెళ్తున్న ఒక పుణ్యాత్ముడు వెంటనే సురేంద్రను ఆసుపత్రికి చేర్చి రక్షించాడని తల్లిదండ్రులు చెప్పారు. అతడు సురేంద్రను ఆసుపత్రిలో చేర్చి, తల్లిదండ్రులు వచ్చేదాకా ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడని చెప్పారు. అబ్బాయి ఎవరని, ఎక్కడ చదువుతున్నాడని విచారిస్తే, మీ పాఠశాలలోనే చదువుతున్నాడని, అతడూ 10వ తరగతి విద్యార్థే అని చెప్పాడు. అతని పేరు మహేంద్ర అని చెప్పారు. రాజేంద్ర సిగ్గుపడ్డాడు. పాఠశాలకు ఎప్పుడూ ఆలస్యంగా రాని మహేంద్ర, ఆరోజు ఉదయం రాలేదంటే ఇదా కారణము? అనుకున్నాడు. మర్నాడు పాఠశాలకు వెళ్లాక రాజేంద్ర మహేంద్రకు క్షమాపణ చెప్పాడు. ఇకనుంచి మనిద్దరం మంచి మిత్రులుగా ఉందామని అన్నాడు. మహేంద్ర సంతోషపడ్డాడు.
సరికొండ శ్రీనివాసరాజు, 8008848703
కనువిప్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



