బీఆర్‌ఎస్‌లోకి ప్రవీణ్‌ షిండే

– కేసీఆర్‌ సమక్షంలో చేరిన శివసేన నేత కండువా కప్పి ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికల పరంపర కొనసాగుతూనే ఉన్నది. మహారాష్ట్ర సౌత్‌ వెస్ట్‌ నాగపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన, ఆ ప్రాంత ప్రజల్లో రాజకీయ పట్టున్న శివసేన పార్టీ (షిండే గ్రూపు) సీనియర్‌ నేత ప్రవీణ్‌షిండే శుక్రవారం బీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో చేరారు. వారితో పాటు పలువురు మహారాష్ట్ర నేతలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సీఎం ఆహ్వానించారు. కాగా నాగ్‌పూర్‌ సౌత్‌ ఈస్ట్‌ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీజేపీ నేత మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దాంతో ప్రవీణ్‌ షిండే చేరిక ప్రాధాన్యత సంతరించుకున్నది.
వీరితో పాటు ధవలయన్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు విక్రమ్‌ పిస్కే, పద్మశాలి యువసేన వ్యవస్థాపకుడు గౌతమ్‌సంగ, వ్యాపారవేత్త రఘురాములు కందికట్ల, సామ్రాట్‌ మౌర్యసేన అధ్యక్షుడు మహారాష్ట్ర అర్జున్‌ సల్గర్‌, బీజేపీ ఓబీసీ సెల్‌ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు వైభవ్‌ షెట్‌, వదార్‌ సమాజ్‌ మహారాష్ట్ర కార్యదర్శి రాజు లింబోల్‌, శివానంద్‌ దారేకర్‌, మోచి సమాజ్‌ కార్యదర్శి మార్కండే షెర్ల, రాజుఅసడే, రవి మేత్రే, సిధ్రామ్‌ మ్హెత్రే, శ్రీకాంత్‌ రౌత్‌, మనోజ్‌ డిగే, కిసాన్‌ నై, బాలకృష్ణ నై, మహేష్‌ డోలారే, రూపేష్‌ ఠాక్రే, మనీష్‌ గావండే, గిరిరాజ్‌ మర్దా, అభిజిత్‌ పవార్‌, ఆశిష్‌ షిండే, అంబాదాస్‌ తాడ్గొప్పుల్‌, ఆకాశ్‌ భవర్‌ తదితరులు చేరారు.
మహారాష్ట్ర సాంప్రదాయ పద్దతిలో సీఎం కేసీఆర్‌ను వారు గొంగడితో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజరు కుమార్‌, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, దండేవిఠల్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్కసుమన్‌, మర్రి జనార్థన్‌రెడ్డి, మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత శంకరన్న డోంగ్రే తదితరులు పాల్గొన్నారు.

Spread the love