తీహార్ జైల్లో కేజ్రీవాల్‌ను కలిసిన పంజాబ్ సీఎం

నవతెలంగాణ – హైదరాబాద్: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఇన్సులిన్ తీసుకుంటున్నారని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం చురుగ్గా ప్రచారం చేయాలని కేజ్రీవాల్ తమకు సూచించారన్నారు. ప్రజలు తన గురించి ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదని, ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఢిల్లీ సీఎం విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.  పంజాబ్‌లో గోధుమల ఉత్పత్తి, విద్యుత్ సరఫరా తదితర అంశాల గురించి కేజ్రీవాల్ తనను అడిగినట్లు చెప్పారు. పంజాబ్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన 158 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ క్లియర్ చేశారని చెప్పడంతో ఆ మాట విని ఎంతగానో సంతోషించినట్లు చెప్పారు. ఇటీవల తాను గుజరాత్‌లో పర్యటించిన విషయాన్ని కేజ్రీవాల్‌కు చెప్పానన్నారు. ప్రజలు ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలు ఆయన సందేశం ఇచ్చారన్నారు.

Spread the love