– మహిళలకు లక్కీ డ్రా
– రూ.5.50 లక్షల విలువైన బహుమతులు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాఖీ పౌర్ణమికి టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా ద్వారా రూ.5.50 లక్షలు విలువైన బహుమతుల్ని అందచేయనున్నట్టు ఆ సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురికి చొప్పున మొత్తం 33 మందికి బహుమతులు ఇస్తారు. ఈ నెల 30, 31 తేదీల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ ఈ లక్కీడ్రాలో పాల్గొనవచ్చు. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ రాసి, వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సుల్లో వేయాలి. వాటన్నింటినీ ఒక చోటికి చేర్చి ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి, ముగ్గురు విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని వారు వివరించారు. ”మహిళలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైంది. అత్యంత పవిత్రంగా ఈ పండుగను వారు జరుపుకుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి మరీ తమ సోదరులకు రాఖీలు కడుతుంటారు. వారి ఆత్మీయత, అనురాగాలకు గుర్తుగా పండుగ నాడు లక్కీడ్రా నిర్వహించాలని నిర్ణయించాం” అని వారు తెలిపారు. సెప్టెంబర్ 9వ తేదీ లోపు లక్కీ డ్రాలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందచేస్తామన్నారు. ఇతర వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 ఫోన్ చేయాలని సూచించారు.