నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగాఉన్న 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ నిమిత్తం సింగరేణి యాజమాన్యం 2022లో ఇచ్చిన నోటీఫికేషన్ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు సోమవారం జస్టిస్ మాధవీదేవి తీర్పునిచ్చారు. తిరిగి పరీక్షలను నిర్వహించాలనీ, అక్రమాలకు తావులేకుండా చేయాలని యాజమాన్యానికి ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ రామగుండం పట్టణానికి చెందిన అభిలాష్ ఇతర అభ్యర్థులు హైకోర్టులో వేసిన పిటిసన్ను న్యాయమూర్తి ఆమోదించారు. గతంలో పరీక్షల ఫలితాల్ని వెల్లడించొద్దన్న స్టే ఉత్తర్వులను రద్దు చేయాలన్న ప్రభుత్వ వినతిని తోసిపుచ్చారు. సింగరేణి యాజమాన్యం 2022 సంవత్సరంలో నోటిఫికేషన్ను జారీ చేసింది. దాదాపు 98,882 మంది అప్లికేష న్లు పెట్టుకున్నారు. 90,928 మంది హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. 2022, సెప్టెంబర్ 4 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 187 సెంటర్స్లో పరీక్షలు నిర్వహించిన పరీక్షలకు 77,907 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ తర్వాత మాస్ కాపీయింగ్ జరిగిందంటూ అభిలాష్ ఇతరులు హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. కోర్తు తీర్పు వచ్చేంత వరకు ఫలితాల్ని వెల్లడించొద్దని గతంలోనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సుదీర్ష వాదనల తర్వాత నియర్ అసిస్టెంట్ పోస్టు భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్టు తీర్పునిచ్చింది. తిరిగి నోటిఫికేషన్ ఇచ్చి ఈ సారి చట్ట నిబంధనలకు అనుగుణంగా సక్రమంగా ఎగ్జామ్ను నిర్వహించాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించింది.