నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ సత్తా చాటింది. రాష్ట్రంలోనే ఫస్ట్ ఇయర్లో రంగారెడ్డి జిల్లా ప్రధమ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ద్వితీయ స్థానాలు దక్కించుకోగా, సెకండ్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ద్వితీయ స్థానం, రంగారెడ్డి జిల్లా మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఇక ఫలితాల్లో మరోమారు హైదరాబాద్ జిల్లా చతికల పడింది. ప్రథమ సంవత్సరంలో గతేడాది మాదిరిగా పదో స్థానానికి పరిమితం కాగా, ద్వితీయ సంవత్సరంలో 13 వ స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం మీద ఇంటర్మీ డియట్ పరీక్షల్లో గ్రేటర్ హైదరాబాద్కు 70 శాతం ఉత్తీర్ణత లభించింది. గతేడాది కంటే ఒక్క శాతం ఉత్తీర్ణత పెరిగినట్టయింది.
ఉత్తీర్ణత ఇలా
ప్రథమ సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా 71.58 శాతం, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా 71.58 శాతం, హైదరాబాద్ జిల్లా 59.90 శాతం, ద్వితీయ సంవత్సరంలో మేడ్చల్ జిల్లా 79.31 శాతం, రంగారెడ్డి జిల్లా 77.63 శాతం, హైదరాబాద్ 65.85 శాతం ఉత్తీర్ణత సాధించాయి.