12 మంది మృతి… 9 మందికి గాయాలు
జహన్నెస్బర్గ్ : దక్షిణాఫ్రికాలోని జహన్నెస్బర్గ్ నగర శివారులో మంగళవారం రాత్రి కొందరు దుండగులు మూకుమ్మడిగా కాల్పులకు తెగబడడంతో 12 మంది ప్రాణాలు కోల్పోగా 9 మంది గాయపడ్డారు. కనీసం పది మంది వ్యక్తులు తుపాకులతో మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత జహన్నెస్బర్గ్ శివారులోని క్లీవ్ల్యాండ్లో ఉన్న జంపర్స్ అనధికారిక సెటిల్మెంట్లో ప్రవేశించారు. ఆ వెంటనే గుంపులుగా విడిపోయి వేర్వేరు ప్రాంతాలలో విచక్షణారహితంగా కాల్పులు జరిపినిద్రిస్తున్న లేదా భయంతో వణికిపోతున్న నివాసితులను చంపేశారు. ఆ ప్రాంతంలో చట్టవిరుద్ధంగా మైనింగ్ జరుపుతున్న గ్రూపుల మధ్య నెలకొన్న వివాదమే కాల్పులకు కారణమై ఉండవచ్చునని జంపర్స్ కమ్యూనిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయి. జంపర్స్ నివాస ప్రాంతం పారిశ్రామిక భవనాల మధ్య ఉంది. ఇది జన సాంద్రత అధికంగా ఉండే గుడిసెల నివాస ప్రాంతం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…తెల్లని టయోటా క్వాంటమ్ వాహనంలో వచ్చిన దుండగులు ఓ పెట్రోల్ స్టేషన్ వద్ద దిగిపోయి రెండు దారుల గుండా అనధికారిక నివాస ప్రాంతంలో ప్రవేశించారు. కాల్పులు జరిపిన తర్వాత అదే వాహనంలో పరారయ్యారు. ఘటనా స్థలంలోనే ఎనిమిది మంది పురుషులు, ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి ఆస్పత్రిలో గాయాలతో చికిత్స పొందుతూ చనిపోయాడు. గాయపడిన వారిని వేర్వేరు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పులకు కారణమేమిటో ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు.
దక్షిణాఫ్రికాలో కాల్పులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



