రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
నల్గొండ జిల్లా, చిట్యాల మండలం,లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, మిల్లును ఆకస్మికంగా తనిఖీ
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రబీ ధాన్యం సేకరణలో భాగంగా మిల్లుల వద్ద అన్లోడింగ్ పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. అన్లోడింగ్ తోపాటు, వెహికల్ రోటేషన్, కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలించడం, లారీలు, హమాలీలను పెంచాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఆయన నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం, పెద్దకాపర్తి లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెదకాపర్తి కేంద్రానికి ఇప్పటివరకు వచ్చిన దాన్యం వివరాలు, హమాలీలు, ,ట్రక్ షీట్లు, మిల్లుల ట్యాగింగ్ చేసిన వాహనాలు,టార్పాలిన్లు, తదితర వివరాలను జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, కేంద్రం నిర్వాహకుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.
కాగా ఇప్పటివరకు ఈ కేంద్రానికి 25 వేల క్వింటాళ్ల దాన్యం వచ్చిందని, ఇందులో 7000 క్వింటాళ్లు కొనుగోలు చేయడం జరిగిందని, ట్యాబ్ ఎంట్రీ కూడా పూర్తి చేశామని, ఇంకా కొనుగోలు కేంద్రంలో 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లు అధికారులు వివరించారు. పెదకాపర్తి కేంద్రం పెద్ద సెంటర్ అయినందున అన్ని పెద్ద సెంటర్లలో 10 నుండి 20 వరకు ఎక్స్ట్రా లారీలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సివిల్ సప్లై కమిషనర్ కు వివరించారు. హమాలీల కొరత లేకుండా మిల్లర్లకు ముందే సమాచారం ఇవ్వడం జరిగిందని, ఒక్కొక్క కొనుగోలు కేంద్రంలో 30 వరకు హమాలీలు ఉన్నారని, అదేవిధంగా మిల్లుల్లో సైతం 30 నుండి 35 వరకు హమాలీలను ఉంచడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ కమిషన్ మాట్లాడుతూ ట్యాబ్ ఎంట్రీ నూటికి నూరు శాతం కావాలని, కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని శుభ్రపరిచేందుకు డ్రయ్యర్లు, శుభ్రపరిచే విధానాలను అడిగి తెలుసుకున్నారు. గన్ని బ్యాగుల వివరాలను, టార్పాలిన్లను అడిగారు. అవసరమైతే ఎక్స్ట్రా టార్పాలిన్లు కొనుగోలు కేంద్రాలలో పెట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం కమిషనర్ వట్టిమర్తిలో ఉన్న సిద్ధార్థ రైస్ ఇండస్ట్రీస్ ను సందర్శించి అక్కడ ఎంత మంది హమాలీలు ఉన్నారని? అడగగా 35 మంది ఉన్నారని తెలిపారు. ఆన్ లోడింగ్, వెహికల్ రోటేషన్ పెంచాలని చెప్పారు.అంతేకాక సిస్టం ద్వారా ధాన్యం వివరాల అప్లోడింగ్ ,ట్యాబ్ ఎంట్రీ వివరాలను ఆయన పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేస్తున్నామని చెప్పారు.
ట్యాబ్ ఎంట్రీ పెండింగ్ ఉన్న కొనుగోలు కేంద్రాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని, మిల్లులలో స్థలం లేకుంటే ఇంటర్మీడియట్ గోడౌన్లకు తరలించాలని, ధాన్యం తరలింపు తో పాటు, మరిన్ని వాహనాలు ఏర్పాటు చేయాలని ట్రాన్స్పోర్ట్ శాఖ డిప్యూటీ కమిషనర్ వాణిని సివిల్ సప్లైస్ కమీషనర్ ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ రోహిత్ సింగ్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌరసరఫరాల శాఖ జీఎం నాగేశ్వర రావు, ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ వాణి, పౌరసరఫరాల శాఖ వెంకటేశం డి ఎం. రాంపతి నాయక్, డిసీఓ పత్యా నాయక్, మార్కెటింగ్ శాఖ ఎడి ఛాయాదేవి, చిట్యాల తహసిల్దార్ విజయ్, తదితరులు ఉన్నారు.



