అందరికీ ధన్యవాదాలు.. బాధపెడితే క్షమించండి

– ట్వీట్‌ చేసిన ఎంపీ బండి సంజయ్ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో ఎవరినైనా బాధపెడితే క్షమించండి. సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. అధ్యక్షులుగా నియమితులైన కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డికి అభినందనలు. ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌ ట్వీట్‌ చేశారు. సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షునిగా అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షా, జేపీ నడ్డాలకు కృతజ్ఞతలు తెలిపారు.
హైకమాండ్‌ అంచనాలను అందుకున్నానని తాను భావిస్తున్నా నన్నారు. కార్యకర్తలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు బండి సంజయ్ సేవలను జాతీయ నాయకత్వం ఉపయోగించుకోవాలని చూస్తున్నదని ప్రచారం జరుగుతున్నది.
కారును బీజేపీ కార్యాలయానికి పంపిన బండి
రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో తాను వాడిన ఫార్చ్యూనర్‌ కారును బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బండి సంజయ్ పంపించారు. తనకు రాష్ట్ర కార్యాలయంలో కేటాయించిన ఛాంబర్‌ను ఖాళీ చేసి ఆఫీస్‌ కార్యదర్శికి అప్పగించారు.

Spread the love