అతిపెద్ద మానవ ప్రయత్నం తెలంగాణకు హరితహారం

–  రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ – సిద్దిపేట
ప్రపంచంలో పర్యావరణ హితమై బ్రెజిల్, చైనా తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అతిపెద్ద మానవ ప్రయత్నం తెలంగాణకు హరితహారం కార్యక్రమమని, ఇది చరిత్రకెక్కిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు  సిద్ధిపేట శివారు రంగనాయక సాగర్ తెలంగాణ తేజోవనంలో శనివారం ఉదయం జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి 30వేల మొక్కలు మంత్రి నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమంతో పాటు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి తెలంగాణకు హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు.
తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో రాష్ట్రంలోనే సిద్ధిపేట జిల్లా రెండవ స్థానంలో నిలిచిందని తెలిపారు.  హరితహారం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ 273.33 కోట్లు మొక్కలు నాటి, దేశంలోనే అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డులో నిలిచిందని కేంద్రం పార్లమెంటులో చెప్పిందని అన్నారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 30 కోట్లు నాటి రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. అడవులు పెరగాలి,  కోతులు వాపస్ పోవాలనే సీఎం కేసీఆర్ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలతో గ్రీన్ కవర్ పెరిగిందని అన్నారు. రాష్ట్రంలో పచ్చదనంతో ఇప్పటికే 28 శాతానికి చేరిందని, మరో 5 శాతం సాధిస్తే 33 శాతం అడవులు ఉన్న రాష్ట్రంగా దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అవుతుందని అన్నారు. అన్నింటా ఆదర్శంగా నిలిచినట్లే ఇప్పటికే ఆకుపచ్చ సిద్ధిపేటగా మార్చుకున్నామని, దాన్ని అలాగే కొనసాగిద్దామని, ఎక్కడ పెరిగే మొక్క పడిపోయినా గమనించి దానికి కట్టె కట్టి సరి చేయాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. సిద్ధిపేట స్వచ్ఛబడి సందర్శించి చెత్త నుంచి సంపద ఏలా సృష్టించొచ్చునో స్వచ్ఛత పాఠాలు నేర్చుకోవాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ కు సూచించారు. అంతకు ముందు జెడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ మాట్లాడుతూ ప్రజాభాగస్వామ్యంతో ముందుకెళ్తున్నామని,  విజయవంతం అవుతున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి హరీశ్ రావు మార్గనిర్దేశంలో ఇప్పటికే బొకేలకు స్వస్తి పలికి బదులుగా పూల మొక్కలు ఇచ్చే స్థాయికి చేరుకుందని, మంత్రి శ్రద్ధతో ఆకుపచ్చ సిద్ధిపేటను చేసుకున్నామని వివరించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో 33 శాతం గ్రీనరీ పెంచేందుకు విశేష కృషి ప్రభుత్వం ద్వారా జరుగుతుందని తెలిపారు. కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతీ గ్రామ పంచాయతీలో 860 మొక్కలను, ప్రతి మున్సిపాలిటీలో 30 వేల మొక్కలను నాటుతున్నామని తెలిపారు. గతంలో నాటిన మొక్కలను 80 నుండి 90 శాతం బ్రతికించుకున్నామని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో అన్నీ కలుపుకుని 4.72 కోట్ల ప్లాంటేషన్ చెసినామని,  మూడున్నర కోట్ల మొక్కలు బతికినవని,  60 వేల ఎకరాల్లో అటవీ సంపద పెరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూడా చైర్మెన్ రవిందర్ రెడ్డి, నాయకులు రాజనర్సు, నాగిరెడ్డి, కనకరాజు, సాయిరాం, వరాల సురేష్, అరవిందు, సతన్న, మున్సిపల్  కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love