– వృద్ధ దంపతులు మృతి
– మరో ఇద్దరికి తీవ్రగాయాలవగా, ఒకరి పరిస్థితి విషమం
నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా బోనకల్ – ముష్టికుంట గ్రామాల మధ్య ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే గల చెట్టును ఢ కొట్టడంతో కారులో ఉన్న వృద్ధ దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవింగ్ చేస్తున్న మనవడు, వృద్ధ దంపతులకు సహాయకుడిగా పనిచేస్తున్న నాగరాజు తీవ్ర గాయాలవగా.. నాగరాజు పరిస్థితి విషమంగా ఉంది. కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెంగోళ్ళు గ్రామానికి చెందిన కొత్తూరు సూర్యనారాయణ డిగ్రీ కాలేజీ లెక్చరర్గా పనిచేస్తూ కొన్నేండ్ల కిందట ఉద్యోగ విరమణ చేశాడు. అనంతరం భార్య రుక్మిణితో కలిసి ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో స్థిరపడ్డారు. సూర్యనారాయణ, రుక్మిణి దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు కుమారులు ఒక్కొక్క నెల చొప్పున తల్లిదండ్రులను పోషిస్తున్నారు. దాంతో పాటు తల్లిదండ్రులకు పూర్తిస్థాయిలో సేవలు అందించేందుకు ఆన్లైన్లో కేర్ టేకర్ను బుక్ చేసుకున్నారు. నాగరాజు అనే వ్యక్తి దంపతులకు నిత్యం సహాయకుడుగా ఉంటూ సేవలు అందిస్తున్నాడు. ఈ క్రమంలో మధిరలో చిన్న కుమారుడు గురు వెంకటేశ్వర్లు దగ్గర నెలరోజుల సమయం పూర్తి కావడంతో ఖమ్మంలో ఉంటున్న పెద్ద కుమారుడు విజయకుమార్ వద్దకు వెళ్లడానికి విజరు కొడుకు అనిల్ రావడంతో బుధవారం మధిర నుంచి అనిల్ తన కారులో వృద్ధ దంపతులతో పాటు నాగరాజు.. కారులో బోనకల్ మీదుగా ఖమ్మం బయలుదేరారు. బోనకల్లు -ముష్టికుంట గ్రామాల మధ్య రాగానే కారు అదుపుతప్పి ప్రమాదవశాత్తు చెట్టుకు ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ, రుక్మిణి కారులోనే ప్రాణాలు కోల్పోయారు. అనిల్, నాగరాజు తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలో వెళ్లారు. అదే సమయంలో బోనకల్ మాజీ ఎంపీపీ తుళ్లూరు రమేష్ ఖమ్మం నుంచి బోనకల్లు వస్తున్నారు. ఆయన ప్రమాదాన్ని గమనించి కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే 108కు సమాచారం అందించారు. వెంటనే 108 సిబ్బంది అక్కడికి చేరుకొని కారు తలుపులను పగలగొట్టి సూర్యనారాయణ, రుక్మిణి మృతదేహాలతో పాటు అనిల్, నాగరాజును బయటకు తీశారు.
అప్పటికే కారు ముందు భాగం నుంచి మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. ఆ మంటల్లోనే 108 సిబ్బంది ప్రాణాలకు తెగించి వారిని బయటకు తీశారు. ప్రాణాలతో ఉన్న అనిల్, నాగరాజులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. నాగరాజు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మధిర సీఐ దొంగరి మధు, బోనకల్ ఎస్ఐ కడగండ్ల మధుబాబు సంఘటనా స్థలానికి చేరుకుని దంపతుల వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా మృతదేహాలను గుర్తించి పోలీసులు బంధువులకు సమాచారం అందించారు. బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను గుర్తించారు. రుక్మిణి ఒంటిపై సుమారు రూ.15 లక్షలు విలువచేసే బంగారు నగలు కూడా ఉండగా.. వాటిని తీయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.