చందమామ పైకి జపాన్ మిషన్ ఒకేసారి రెండు ప్రయోగాలు..!

నవతెలంగాణ- హైదరాబాద్ :చంద్రయాన్-3 విజయవంతమైన తర్వాత ప్రపంచ దేశాలకు జాబిల్లిపై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో జపాన్ కూడా తన మూన్ మిషన్ ను ఈ ఉదయం చేపట్టింది. తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లొరేషన్ ఏజెన్సీ (జాక్సా) రాకెట్ ను ప్రయోగించింది. జపాన్ కాలమానం ప్రకారం ఉదయం 8.42 గంటలకు (భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5.12 గంటలకు) హెచ్2ఏ రాకెట్ ను నింగిలోకి పంపింది. ఈ రాకెట్ ద్వారా రెండు ఒక ఉపగ్రహాన్ని, ల్యాండర్ ను జపాన్ ప్రయోగించింది. వీటిలో ఒకటి ఎక్స్ రే టెలిస్కోప్ కాగా… రెండోది తేలికపాటి మూన్ ల్యాండర్. జపాన్ కాలమానం ప్రకారం ఉదయం 8.56 గంటలకు టెలిస్కోప్ తో కూడిన ఉపగ్రహాన్ని భూ కక్ష్యలో ప్రవేశపెట్టారు. 9.29 గంటలకు మూన్ ల్యాండర్ ను రాకెట్ నుంచి వేరు చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో చంద్రుడిపై ల్యాండర్ దిగుతుందని భావిస్తున్నారు. మరోవైపు మే నెలలో జపాన్ చేపట్టిన మిషన్ క్రాష్ అయింది. దీంతో, ఈ ప్రయోగం సక్సెస్ కావడం ఆదేశానికి ఎంతో ముఖ్యం.

Spread the love