రూ.26వేల కనీస వేతనం చెల్లించాలి
ఎర్రజెండా నీడలోనే కార్మిక రక్షణ : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
కరీంనగర్లో ఘనంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్
అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రజతోత్సవాలు
నవతెలంగాణ – కరీంనగర్
కార్మికుల హక్కులను హరించే కొత్త లేబర్ కోడ్స్ను వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) 25వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో రజతోత్సవ సంబురాలు నిర్వహించారు. గీతా భవన్ చౌరస్తా నుంచి కళాభారతి వరకు డప్పు చప్పుళ్లు, ఎర్రజెండాలు పట్టుకుని కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సభకు పాలడుగు భాస్కర్తోపాటు రాష్ట్ర కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పాలడుగు సుధాకర్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్ హాజరయ్యారు. అనంతరం జరిగిన సభలో పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను రద్దు చేస్తూ, కార్మికులను యజ మానుల వద్ద కట్టుబానిసలుగా మార్చేలా లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి వల్ల దశాబ్దాల పోరాట ఫలితంగా సాధిం చుకున్న హక్కులు హరించుకు పోతాయన్నారు. ఈ లేబర్ కోడ్స్ రద్దు కోసం కార్మికులందరూ రాజకీయ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
నాడు కేవలం రూ.1,250గా ఉన్న వేతనాన్ని నిరంతర పోరాటాల ద్వారానే నేడు రూ.16,600 పెంచుకోగలిగామని చెప్పారు. అయితే, ప్రస్తుత ధరలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుత్, ఆర్టీసీ కార్మికుల తరహాలోనే మున్సిపల్ కార్మికులు కూడా సంఘటితం కావాలని నాయకులు సూచించారు. ఎర్రజెండా నీడలో సాగే ఉద్యమాలే కార్మికులకు అసలైన రక్షణ కవచాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మహిళా రాష్ట్ర కన్వీనర్ ముక్కెర బుజ్జమ్మ, యునియన్ రాష్ట్ర కార్యదర్శులు ఆకుల వెంకటేష్, సావనపెల్లి వెంకటస్వామి, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకరి సంపత్, జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ కాంపెల్లి పోచయ్య, కరీంనగర్ నగర అధ్యక్షులు మల్లేశం, ప్రధాన కార్యదర్శి శ్యామ్సుందర్, దాసరి రాజమల్లయ్య, హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



