నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ నుంచి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో ఈరోజు హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గులాబీ పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరిన శ్రీహరికి గుణపాఠం చెప్పాలని, ఆ కసి కార్యకర్తలో కనిపిస్తుందన్నారు. కడియం బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయాక పార్టీలో జోష్ పెరిగిందని తెలిపారు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కడియం శ్రీహరి అని మండిపడ్డారు. బీఆర్ఎస్ కడియంకు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిందని, అసలు ఆయన ఎందుకు పార్టీ మారారో? చెప్పాలని హరీశ్రావు అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో కడియం శ్రీహరి ఇంకో గ్రూప్ పెడతారా? అని ప్రశ్నించారు. తన కూతురు కావ్య కోసం ఎంపీ టికెట్ తీసుకుని చివరి నిమిషంలో తప్పుకున్నారని, ఇంతకుమించిన ద్రోహం మరోకటి ఉంటుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే పదవికి ఆయన వెంటనే రాజీనామా చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు.