తప్పిపోయిన పాపను గంటలోపు తండ్రి వద్దకు చేర్చిన పోలీసులు

నవతెలంగాణ – ఆర్మూర్

తప్పిపోయిన పాపను గంటలోపు తండ్రి వద్దకు పోలీసులు చేర్చిన సంఘటన మంగళవారం పట్టణంలో వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నవి… మున్సిపాలిటీ పరిధిలోని రాజారాం నగర్ కాలనీకి చెందిన షేక్ నహీం కూతురు షేక్ మహేరా (7) తప్పిపోయిందని పాప తండ్రి 100 కి కాల్ చేసి పోలీసులకు వివరాలను వెల్లడించారు. దీనికి స్పందించిన పట్టణ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవికుమార్ ఆదేశాల మేరకు పోలీసులతో  పరిసర ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. రాజారాం నగర్ కాలనీ నుండి మూగదైన పాప ఆడుకుంటూ మామిడిపల్లి చౌరస్తా వరకు వెళ్ళింది. పాపను వెతికే క్రమంలో కానిస్టేబుల్ రాములు, హోంగార్డు స్వామి పాపను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. తదననంతరం పాప తండ్రికి కాల్ చేసి ఎస్ హెచ్ ఓ సమక్షంలో తండ్రి షేక్ నహీం కు అప్పగించారు. చాకచక్యంతో పాపను పట్టుకున్న కానిస్టేబుల్, హోంగార్డును ఎస్ హెచ్ ఓ అభినందించారు.
Spread the love