– ఏకరూప పాలన అమలు చేయాలి
– టీఎస్యూటీఎఫ్ మహా ధర్నాలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఉన్నత ప్రమాణాలతో అత్యున్నత ఫలితాలు సాధిస్తున్న గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించాలని, శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వాలని, అన్ని గురుకులాల్లో ఏకరూప పాలన అమలు చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులతోనే గురుకులాలకు మంచి పేరు వచ్చిందన్నారు. శనివారం టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య అధ్యక్షతన అన్ని సంక్షేమ గురుకుల విద్యాసంస్థల ఉపాధ్యాయులు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సిరెడ్డి, రంగారెడ్డి హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు సంతోషంగా పని చేయగలిగితేనే విద్యార్థులకు సంతృప్తికరంగా బోధించగలుగుతారన్నారు. సామాజిక అంతరం పోవాలంటే గురుకులాలన్నీ ఒక్కటి కావాలన్నారు. కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని, తాత్కాలిక ఉపాధ్యాయులకు బేసిక్ పే ఇవ్వాలనీ, బీసీ గురుకుల పాఠశాలల సమయాలను ఇతర సొసైటీలతో సమానంగా మార్చాలని డిమాండ్ చేశారు. కేర్ టేకర్ నియామకం వంటి ఆర్థిక భారం లేని సమస్యలను పరిష్కరించి ఉపాధ్యాయుల మన్ననలను పొందాలన్నారు. గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ రాస్తామన్నారు. ప్రభుత్వం వెంటనే గురుకుల ఉపాధ్యాయులను చర్చలకు పిలిచి, శాసనసభలో ప్రకటన చేయాలని, లేదంటే సీపీఐ(ఎం) నుంచి బలమైన ఒత్తిడి తీసుకొస్తామని జూలకంటి రంగారెడ్డి హెచ్చరించారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ అన్ని గురుకులాలకు కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని, జీఓ 317 అమలుపై వివాదాలను, అభ్యంతరాలను సానుకూలంగా పరిష్కరించాలని, బదిలీలు, పదోన్నతులను చేపట్టాలని డిమాండ్ చేశారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య మాట్లాడుతూ రెసిడెన్షియల్ స్కూల్ పెంచడం బాగానే ఉన్నా.. అందులో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ పోస్టుల్లో కాంట్రాక్టు విధానం ఉండొద్దన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయడం ప్రభుత్వానికి క్షేమం కాదని హెచ్చరించారు.
టీఎస్యూటీఎఫ్ కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, కార్యదర్శి సింహాచలం, సీనియర్ నాయకులు పి.మాణిక్రెడ్డి, గురుకులాల ప్రతినిధులు ఎస్.శ్రీజన, డి.ఎల్లయ్య, జి.రాం బాబు, వి.హరీందర్రెడ్డి, ఎన్.రాజశ్రీ, బి.ప్రతిభ, లివిన్ స్టన్, మహేష్, దామోదర్, వేదాంతాచారి, డా.సత్యం, టీఎస్యూటీఎఫ్ జిల్లా నాయకులు వై.సైదులు, వి.అశోక్, గోపాల్ నాయక్, రమేష్ కుమార్, వలీ అహ్మద్, యాదగిరి, శ్యాంసుందర్, తదితరులు మాట్లాడారు. అనంతరం నెల రోజుల్లో సమస్యలు పరిష్కారం కాకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు ప్రకటించారు. ఈ మహాధర్నాకు వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో గురుకుల ఉపాధ్యాయులు హాజరయ్యారు.