టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి.. దుస్తులు చిరిగిపోయేలా!

నవతెలంగాణ – హైదరాబాద్:  పాఠశాలకు ఆలస్యంగా వచ్చిందన్న కారణంతో టీచర్‌పై ప్రిన్సిపాల్ చేయి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మే 3న ఆగ్రాలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆగ్రా లోని సీగానా గ్రామంలోని ప్రీ సెకండరీ స్కూల్‌లో పనిచేస్తున్న గుంజన్‌ చౌదరి పాఠశాలకు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆగ్రహించిన ప్రిన్సిపాల్ సదరు టీచర్‌పై దాడి చేసింది. ఆ సమయంలో టీచర్‌ దుస్తులు కూడా కాస్త చిరిగిపోయాయి. అక్కడే ఉన్న తోటి టీచర్లు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఈ క్రమంలోనే ఘర్షణలో ఇద్దరు పరస్పరం అసభ్య పదజాలాన్ని వాడారు. గొడవ జరుగుతున్న సమయంలో కొంత మంది విద్యార్థులు చూస్తున్నారు. గొడవలో టీచర్‌ గాయపడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ గొడవను అక్కడే ఉన్న కొందరు తమ కెమెరాల్లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే దీనిపై పోలీసులు విచారణ చేస్తుండడంతో అధికారికంగా కేసు నమోదు కాలేదు. నెటిజన్లు మాత్రం ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Spread the love