– టిపియుఎస్ సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ – మల్హర్ రావు : ప్రభుత్వ ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ టిపియుఎస్ సంఘం ఆధ్వర్యంలో శనివారం మండల తహసీల్దార్ రవికుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. పీఆర్సీకి 51 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని, పెన్షనర్లకు సంబంధించిన ఈ-కుబెర్లో పెండింగ్లో ఉన్న బిల్లులను పూర్తిగా చెల్లించి, భవిష్యత్తులో ఎలాంటి బిల్లులు పెండింగ్లో లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆరు డీఏలను ప్రకటించడంతో పాటు పెన్షనర్లకు సంబంధించిన అన్ని బెనిఫిట్లను క్లియర్ చేయాలని కోరారు.
కేజీబీవీ, ఎస్ఎస్ఏ మహిళా ఉపాధ్యాయులు, సిబ్బందికి సమ్మె కాలపు వేతనాలు చెల్లించి, ఎంటీఎస్ను అమలు చేయాలని, మోడల్ స్కూల్ 010 పద్దు విషయంలో ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 190ను ఇతర శాఖలు అమలు చేసినప్పటికీ విద్యాశాఖలో ఇంకా పెండింగ్లో ఉంచారని, అప్పీల్ చేసుకున్న వారందరికీ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేయాలని, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్ఎల్పీని వెనక్కి తీసుకోవాలని కోరారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన సీపీఎస్ రద్దు అంశంపై ప్రత్యేక చొరవ తీసుకుని ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గురుకుల, ఆశ్రమ, ఎయిడెడ్ పాఠశాలల సమస్యలతో పాటు అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్థిక, ఆర్థికేతర అంశాల్లో ప్రభుత్వం ఉపాధ్యాయులను తీవ్రంగా విస్మరిస్తోందని విమర్శించారు. జూన్ 2 నుంచి హెల్త్ కార్డులు అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ, మే నెల వేతనాల్లో వాటా కోత విధించడం సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిపియుఎస్ జిల్లా నాయకుడు బి. నల్లా శ్రీధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు జంగిలి రాజేందర్, ప్రధాన కార్యదర్శి బి. మురళి, మనోహర్ రావుతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



