– హైకోర్టు తీర్పు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారాం గ్రామంలోని సర్వే నెం.307లోని కోట్ల రూపాయల విలువైన 18 ఎకరాల భూమి హక్కుల వివాదం సివిల్ కోర్టు తేల్చాలని హైకోర్టు తీర్పు చెప్పింది. విచారణాధికారం పేరుతో సివిల్ కోర్టు చేయాల్సిన పనిని హైకోర్టు చేయలేదని చెప్పింది. ఆ భూమి ప్రయివేటు వ్యక్తులదేనని 2013లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ ఇటీవల తీర్పు చెప్పింది. విచక్షణాధికారం పేరుతో హక్కులను కాపాడాలని, హక్కులను సృష్టించకూడదదని చెప్పింది. 18 ఎకరాలపై హక్కులు ఎవరివో సివిల్ కోర్టు తేల్చాలని చెప్పింది. ప్రభుత్వ-ప్రయివేటు వ్యక్తుల భూహద్దులు గుర్తించకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును చెల్లదని తేల్చింది. ఆ గ్రామంలోని సర్వే నెం 307లోని 18 ఎకరాలు ప్రయివేటు వ్యక్తులవే నంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.
గాజుల రామారానికి చెందిన నర్సింహారెడ్డి, సీతారామరెడ్డి ఇతరులకు ఎందిన 441 ఎకరాల్లో 318లను ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద స్వాధీనం చేసుకుంది. ఆ భూమిని 2007లో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు లీజుకిచ్చింది. ఆ భూమిలో 18 ఎకరాలను తాము కొన్నామని 2011లో పద్మనాభరావు వేసిన కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అప్పీల్ చేసిన పిటిషన్లో సానుకూల తీర్పు చెప్పింది.