Thursday, April 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవచ్చేనెల 21 నుంచి జూన్‌ ఒకటి వరకు సరస్వతీ అంత్య పుష్కరాలు

వచ్చేనెల 21 నుంచి జూన్‌ ఒకటి వరకు సరస్వతీ అంత్య పుష్కరాలు

- Advertisement -

పోస్టర్‌ ఆవిష్కరించిన కొండా సురేఖ, శ్రీధర్‌బాబు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

వచ్చేనెల 21 నుంచి జూన్‌ ఒకటి వరకు సరస్వతీ అంత్య పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలోని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలసి మంత్రి కొండా సురేఖ తన చాంబర్‌లో సరస్వతీ అంత్య పుష్కరాలకు సంబంధించిన పోస్టర్‌, అధికారిక టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఈ సరస్వతీ అంత్య పుష్కరాలను కాళేశ్వరంలో నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. రూ.30.63కోట్లతో 162 అబివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు.

భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ప్రశాంత వాతావరణంలో భక్తులు పుష్కర స్నానం, స్వామి దర్శనం చేసుకొనే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో పని చేయా లని సూచించారు. ఈ అంత్య పుష్కరాలకు 30 లక్షల మంది భక్తులు హాజరు కానున్నట్టు తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరస్వతీ ఆది పుష్కరాలు (మే 15, 2025 నుండి మే 26, 2025), సమ్మక సారలమ్మ జాతర నిర్వహణకు అవకాశం వచ్చిందని చెప్పారు. వీటిని అత్యంత ఘనం గా నిర్వహించామని తెలిపారు. ఇప్పుడు సరస్వతీ అంత్య పుష్కరాలు, వచ్చే సంవత్సరం రానున్న గోదావరి పుష్కరాలకు కూడా ఇప్పటికే పనులను ప్రారంభించామని గుర్తు చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సరస్వతీ పుష్కరాలను భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు.

10 రోజుల ముందే పుష్కరాల పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌ సమస్య కలగకుండా పోలీసు యంత్రాంగం, ఇతర శాఖల సమన్వ యంతో పని చేయాలని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి పుష్కరాలను విజయవంతం చేయాలని కోరారు. కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణానికి రూ.198 కోట్లను కేటాయించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన కతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌ మాట్లాడుతూ పుష్కరాలను మొదటి రోజు ఉదయం 5.43 గంటలకు కంచికామకోటి పీఠాధిపతి శంకర విజేంద్ర సరస్వతీ స్వామి సరస్వతీ పుష్కరాలను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, కాళేశ్వర ఆలయ ట్రస్ట్‌ చైర్మెన్‌ మోహన్‌ శర్మ, దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -