బోరుబావి చిన్నారి కథ విషాదాంతం

నవతెలంగాణ భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో బోరుబావిలో పడిపోయిన రెండున్నరేళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. రెండు రోజులకుపైగా అవిశ్రాంతంగా శ్రమించిన చిన్నారిని వెలికితీశారు. కానీ, ఆస్పత్రికి తరలించిన అనంతరం చిన్నారి చనిపోయినట్టు ప్రకటించారు. మంగళవారం పాప బోరుబావిలో పడిపోయిన దగ్గర నుంచి నిరంతర సహాయక చర్యలు చేపట్టి నేటి సాయంత్రానికి బయటకు వెలికితీశారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఊపిరాడక అప్పటికే చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఇక్కడి సెహోర్‌ జిల్లా ముంగావలీ గ్రామంలో రెండున్నరేళ్ల చిన్నారి.. మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ 300 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన విషయం తెలిసిందే. తొలుత ఆ పాప 20 అడుగుల లోతులో చిక్కుకుపోగా.. అనంతరం 40 అడుగుల లోతుకు జారిపోయింది. ఈ క్రమంలోనే ఘటనాస్థలానికి చేరుకున్న సైన్యంతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఈఆర్‌ఎఫ్‌ బృందాలు హుటాహుటిన సహాయక చర్యలు ప్రారంభించాయి. గురువారం రోబోటిక్‌ నిపుణులూ రంగంలోకి దిగారు. ఒకవైపు వర్షం, ఈదురుగాలులు.. మరోవైపు రాతి నేల కావడంతో సహాయక చర్యల ప్రకంపనలకు చిన్నారి మరింత కిందికి జారిపోతుండటం.. సిబ్బందికి సవాల్‌గా మారింది. అప్పటికే చిన్నారికి పైపు ద్వారా ఆక్సిజన్ సరఫరా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే దాదాపు 52 గంటలపాటు సహాయక చర్యలు చేపట్టి.. 100 అడుగుల లోతులో పాపను వెలికితీశారు. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. చివరకు పాపను కాపాడుకోలేకపోయామని కలెక్టర్‌ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love