యువతుల సమ్మతి వయసును 16కి తగ్గించండి: మధ్యప్రదేశ్‌ హైకోర్టు

– బాలురకు అన్యాయం జరగకుండా కాపాడాలని వ్యాఖ్య

నవతెలంగాణ హైదరాబాద్: మారిన సామాజిక పరిస్థితుల నేపథ్యంలో శృంగారానికి సమ్మతి తెలిపే వయసును బాలికలకు 18 నుంచి 16 ఏండ్లకు తగ్గించాలని మధ్యప్రదేశ్‌ హైకోర్టు గ్వాలియర్‌ ధర్మాసనం అభిప్రాయపడింది. తద్వారా టీనేజ్‌ బాలురను చట్టపరమైన చర్యల నుంచి కాపాడవచ్చని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. 2020లో ఒక బాలికపై పదేపదే లైంగికదాడి చేసి, గర్భవతిని చేశాడంటూ ఒక యువకునిపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు జూన్‌ 27న కొట్టివేసింది. ఈ సందర్భంగా కేంద్రానికి పై సూచన పంపింది. ప్రస్తుత కేసులో ఫిర్యాదీ 2020లో బాలిక. అప్పట్లో ఆమె ఒక వ్యక్తి వద్ద విద్యాపరమైన శిక్షణ పొందేది. అతడు ఒకరోజు మత్తు మందు కలిపిన పానీయం ఇచ్చి తనపై లైంగికదాడి చేశాడని, దాన్ని వీడియో తీసి బెదిరిస్తూ పదేపదే తనను లొంగదీసుకుంటున్నాడని ఆరోపించింది. తరవాత ఆమెకు ఒక సన్నిహిత బంధువుతోనూ శారీరక సంబంధం ఉన్నట్టు తేలిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్‌ వల్ల బాలబాలికలకు 14 ఏండ్ల వయసులోనే పెద్దరికం వస్తోందనీ, బాలికలు 14 ఏండ్లకే యవ్వన దశకు చేరుకుంటున్నారని హైకోర్టు న్యాయమూర్తి దీపక్‌ కుమార్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. కిశోరప్రాయంలోనే బాలబాలికలు పరస్పర శారీరక ఆకర్షణలకు లోనవుతున్నారని తెలిపారు. ఇందులో ఇద్దరి తప్పిదం ఉన్నప్పటికీ బాలురు నేరారోపణలను ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిలో రతికి సమ్మతి తెలిపే వయసును 18 నుంచి 16 ఏండ్లకు తగ్గించాలని సూచించారు. నిజానికి భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)కి సవరణ చేయక ముందు ఈ వయసు 16 ఏండ్లగానే ఉండేదని తెలిపారు. దీన్ని పునరుద్ధరించడం ద్వారా బాలురకు అన్యాయం జరగకుండా కాపాడవచ్చన్నారు. 2012లో యవతుల సమ్మతి వయసును 16 నుంచి 18కి పెంచడం సమాజ నిర్మాణానికి భంగం కలిగించిందని వ్యాఖ్యానించింది.

Spread the love