నవతెలంగాణ – తిరువనంతపురం : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె టి.వీణాకు చెందిన సంస్థకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్ను ప్రత్యేక విజిలెన్స్ కోర్టు సోమవారం కొట్టివేసింది. ప్రైవేట్ మైనింగ్ కంపెనీ -వీణాకు చెందిన ఐటి కంపెనీ (ప్రస్తుతం పనిచేయడం లేదు) మధ్య జరిగిన ఆరోపిత ఆర్థిక లావాదేవీలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మాథ్యూ కుజల్నాథన్ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (సిఎంఆర్ఎల్), వీణాకు చెందిన ఎక్సాలాజిక్ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారణకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ నిరాకరించిందని, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత సమర్పించిన పత్రాలపై వివరణాత్మక విచారణ అనంతరం కోర్టు పిటిషన్ను కొట్టివేసింది.