నమ్మించి నట్టేట ముంచారు… సీటు ఇస్తానని అమ్ముకున్నారు…

– కాంగ్రెస్ అధిష్టానం పై సున్నం నాగమణి ఆరోపణలు..
నవతెలంగాణ – అశ్వారావుపేట: కాంగ్రెస్ పార్టీ నమ్మించి నట్టేట ముంచింది అని ములకలపల్లి జడ్పీటీసీ, అశ్వారావుపేట టికెట్ ఆశించి భంగపడ్డ సున్నం నాగమణి తీవ్ర ఆరోపణలు చేశారు.అశ్వారావుపేట కాంగ్రెస్ అభ్యర్థిగా తనకే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చి నమ్మకద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని మండల పరిషత్ పూర్వ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత సున్నం నాగమణి కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.గత 17 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తే పార్టీ తనను మోసం చేసిందని అన్నారు. పార్టీ కోసం నిద్రాహారాలు లేకుండా శ్రమించానని,ఆస్తులు అమ్ముకుని పార్టీ ఎదుగుదలకు పాటుపడ్డానని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సర్వేలు నిర్వహిస్తుందని, సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉంటే వారికే టిక్కెట్ అని మాయమాటలు చెప్పారని ఆమె వాపోయారు.కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ దక్కాలంటే మూడు నాలుగు పార్టీలు మారాలని ఆమె కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు.తనకు టికెట్ కేటాయించనప్పుడు తనతో పార్టీకి సేవలు ఎందుకు చేయించుకున్నారని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశానని, కాంగ్రెస్ పార్టీ నన్ను మోసం చేసిందని ప్రతి షాప్ కి చెప్పుకుంటూ ప్రచారం చేస్తూ తనని నమ్ముకున్న కార్యకర్తల అభీష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఒకే దిశలో బోరున విలపించారు.

Spread the love