ప్రజల కోసం పనిచేసే వారినే ఎన్నుకోవాలి

ప్రజల కోసం పనిచేసే వారినే ఎన్నుకోవాలి– భువనగిరి అభ్యర్థి జహంగీర్‌ను పార్లమెంట్‌కు పంపించండి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య, మల్లు లకిë, సాగర్‌
నవతెలంగాణ-నకిరేకల్‌/ మద్దిరాల/ఆలేరు టౌన్‌
ప్రజా సమస్యలపై పోరాడుతూ.. వారి కోసం పనిచేసే నేతనే ఎన్నుకోవాలని, అలాంటి నాయకుడు సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్‌ను ఎన్నికల్లో గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సభ్యులు జి.నాగయ్య, మల్లు లకిë, తీగల సాగర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇంటింటికీ తిరిగి ఓటు ప్రాధాన్యత, జహంగీర్‌ గురించి వివరించారు. సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి.జహంగీర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నకిరేకల్‌ పట్టణంలోని 2, 3 వార్డులలో నాగయ్య ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. సమస్యలపై పోరాడలేని అసమర్థులకు ఓటు వేయొద్దని నాగయ్య అన్నారు. పోరాడే వారికి ఓటు అనే ఆయుధాన్ని ఇస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల, చౌల్లతండా గ్రామాల్లో మల్లు లకిë ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి ప్రజలపై అనేక భారాలు పడుతున్నా పార్లమెంట్‌లో ప్రశ్నించేవారి వారి సంఖ్య తగ్గుతోందని, మెజార్టీ సభ్యులు పెట్టుబడిదారులు, కార్పొరేట్ల ప్రయోజనాల గురించి ఆలోచించేవారని చెప్పారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కొనసాగుతున్న మోడీ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు.
అవకాశవాద పార్టీలను ఓడించండి
అవకాశవాద పార్టీలను ఓడించండని తీగల సాగర్‌ పిలుపునిచ్చారు. ఆలేరు పట్టణంలోని కొలనుపాక రోడ్డు, సంతోషిమాత గుడి ఆవరణలో ఇంటింటి ప్రచారంలో ఆయన మాట్లాడారు. డబ్బులు, కులం, మతం అడ్డుపెట్టుకొని వచ్చే అవకాశవాద పార్టీలను చిత్తుగా ఓడించి.. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించే ఎండి జహంగీర్‌ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Spread the love