ట్రంప్, నెతన్యాహులను ఆవహించిన హిట్లర్ భూతం
నాజీ నియంత ఆశయాలకూ, సామ్రాజ్యవాద దురాక్రమణకూ పోలిక
సామ్రాజ్యవాదానికి సేవకుడిగా మోడీ ప్రభుత్వం : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
కొచ్చి: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను హిట్లర్ భూతం ఆవహించిందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ అన్నారు. ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న నాజీ నియంత ఆశయాలకూ, అమెరికా -ఇజ్రాయిల్ కూటమి ప్రస్తుతం చేస్తున్న సామ్రాజ్యవాద దురాక్రమణకూ మధ్య ఆయన స్పష్టమైన పోలికను చూపారు. ఎర్నాకుళంలో ఈఎంఎస్ స్టడీ అండ్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ”అమెరికన్ యుద్ధోన్మాదం, మారుతున్న ప్రపంచం” అనే అంశంపై జరిగిన సెమినార్ ప్రారంభోత్సవంలో బేబీ ప్రసంగించారు. మానవాళిని దోపిడీ పట్టులో ఉంచే ఒక పెద్ద కుట్రలో భాగంగా, ఒకప్పుడు హిట్లర్ అనుసరించిన లక్ష్యాలనే .. అంటే సైనిక, రాజకీయ ఆధిపత్యంతో పాటు సహజ వనరుల దోపిడీని.. ట్రంప్, ఆయన అనుచరులు కూడా అనుసరిస్తున్నారని బేబీ అన్నారు. ఈ సామ్రాజ్యవాదాని కి సేవకుడిగా మోడీ ప్రభుత్వం నిలుస్తోందని ఆయన ఆరోపించారు. మోడీ, అమిత్ షా, మోహన్ భగవత్ల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, వారిని బట్టబయలు చేయాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ చట్టాలను బరితెగించి ఉల్లంఘిస్తున్నప్పుడు, ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ దాడుల విషయంలో భారతదేశం మౌనం వహించడాన్ని కూడా ఆయన విమర్శించారు. స్పందించాల్సిన రీతిలో భారతదేశం విఫలమైందని ఆయన అన్నారు. ”భారతదేశం చేయాల్సింది చేయలే దు,” అని ఆయన అన్నారు. ఈఎంఎస్ స్టడీ అండ్ రీసెర్చ్ సెంటర్ చైర్మెన్ ఎస్. సతీష్ అధ్యక్షత వహించా రు. ఈ కార్యక్రమంలో బేబీ రెండు పుస్తకాలను కూడా విడుదల చేశారు: డాక్టర్ ధర్మరాజ్ అడత్ రచించిన ‘కీళాలంటే చొరయిల్ కుతిర్న పలియం సమరం’, పరిశోధనా కేంద్రం ప్రచురించిన ‘కేరళం: ఇడతుపాక్ష బదల్ చరిత్రవుమ్ ఆహ్వానవుమ్’ అనే పుస్తకాలను వరుసగా సీఎం దినేష్మణి , కె.వి. థామస్ స్వీకరించారు.



