రోగనిరోధక శక్తిని పెరగాలంటే..

రానున్నది వర్షాకాలం.. ఎండ వేడి నుంచి చల్లదనంలోకి వాతావరణం మారబోతోంది. ఈ సమయంలో శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకోకపోతే అనారోగ్య సమస్యలు వేధించడం ఖాయం. ముఖ్యంగా జలుబు వంటివి త్వరగా వ్యాప్తి చెందుతాయి. అదే మన శరీరంలో రోగనిరోధక శక్తి ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. రోగనిరోధిక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం మన చేతుల్లో వున్నదే. ఇందుకోసం పెద్దగా డబ్బు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. ఖరీదైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. వంటగదిలోనే సులభంగా లభించే వాటితో చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు రోగనిరోధక శక్తిని పెంచుకుని ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆ ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…
పసుపు : పసుపుని మనం వంటలకు మాత్రమే కాక గాయాలకు కూడా వాడతాం. ఎన్నో రకాల సమస్యలకు పసుపు మేలు చేస్తుంది. పసుపులో యాంటీ ఫంగల్‌, యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలను కలిగి వుండటమే ఇందుకు కారణం. ఇది వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడేందు మన శరీరాన్ని సిద్ధం చేస్తుంది.
తేనె : తేనె చేసే మేలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇందులో అద్భుత మైన ఔషధ గుణాలున్నాయి. వ్యాధులను తగ్గించే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. శరీరంలోని సూక్ష్మ క్రిములను నాశనం చేసే శక్తి తేనెకి ఉంది. తేనెలో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, పుప్పొడి ఉన్నాయి. ఇవి క్రిమినాశక మందులుగా తయారవుతాయి. కాలానుగుణంగా వచ్చే అలెర్జీల నుండి రక్షించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.
అల్లం : నిత్యం కూరల్లో వాడే అల్లంలో కూడా అనేక ప్రయోజనాలున్నాయి. అల్లం గొంతు, ఛాతి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. అలాగే మన శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తికి అందిస్తుంది. అల్లాన్ని పచ్చిగా తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లు మన దరికి చేరకుండా కాపాడగలుగుతుంది.
వెల్లుల్లి : వ్యాధినిరోధక శక్తి పెంచడంలో వెల్లుల్లి పవర్‌ ఫుల్‌గా పనిచేస్తుంది. జింక్‌, సల్ఫర్‌, సెలీనియమ్‌, విటమిన్‌ ఏ, ఈ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ వైరల్‌ వంటి గుణాలు కూడా ఉంటాయి. వీటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా జీర్ణాశయంలో పుండ్లు, క్యాన్సర్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాను వెల్లుల్లి బాగా ఎదుర్కొంటుంది. రోజుకి ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బని తినడం వల్ల జలుబు, దగ్గును దరి చేరనివ్వదు.
నల్ల మిరియాలు : నల్ల మిరియాలు రుచి కోసమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఘాటుగా ఉండే ఈ నల్ల మిరియాలను ఏదో ఒక రూపంలో రోజూ భోజనంలో తీసుకుంటే అనేక లాభాలున్నాయి. వీటిని కాలిమిర్చి అని కూడా పిలుస్తారు. రోగ నిరోధక శక్తిని పెంచడం లో ఎంతో సహాయ పడుతుంది. మసాలాలో సహజంగా విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. మిరియాలలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి.
నిమ్మ : అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి విటమిన్‌ సి చాలా అవసరం. అంతేకాదు.. వైరస్‌, బ్యాక్టీ రియా నుంచి కూడా కాపాడటానికి విటమిన్‌ సి చాలా అవసరం. సాధారణ జలుబును దూరంగా ఉంచడానికి సిట్రస్‌ అద్భుతంగా పని చేస్తుంది. నిమ్మ మంచి యాంటీ ఫంగల్‌, క్రిమినాశిని. నిమ్మకాయలో అధికంగా లభించే విటమిన్‌ సి కంటెంట్‌ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
వీటితో పాటు ఆరోగ్యంగా ఉండటానికి, సహజంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే కొన్ని చిట్కా లున్నాయి. రోజూ వ్యాయామం చేయడం, బరువు, రక్తంలో చక్కెర శాతాలను పరిశీలించుకుంటూ ఉండటం, ఆహారం లో తగినన్ని పోషకాలు ఉండేలా చూసుకుంటూ సమతు లాహారం తీసుకుంటూ 8 గంటలు నిద్ర పోతుండాలి.

Spread the love