నివాళి
తెలంగాణ భాష నుడికారాన్ని తన కలం నిండా నింపుకున్న రచయిత, విలక్షణ నాటకీయ రచనలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న కలం యోధుడు, వ్యంగ్య రచనలో పేరెన్నికగన్న తెలిదేవర భానుమూర్తి (73) మరణం, సాహిత్య, పత్రికారంగాలకు తీరని లోటు. పత్రికలో తెలంగాణ యాసను ప్రవేశపెట్టి, మట్టి మనుషుల పలుకుబడులను ప్రయోగించి జనగుండె ధ్వనుల వినిపించిన పాత్రికేయుడు భానుమూర్తి. ప్రజాశక్తి పత్రికలోనూ, ఆ తర్వాత నవతెలంగాణ పత్రికలోనూ కాలమిస్టుగా రచననందించారు. నవతెలంగాణ ఆదివారం ‘సోపతి’ సంచికలో ‘లత్కోర్సాబ్’ పేరుతో ఒక సీరియల్ వ్యంగ్య రాజకీయ రచన నడిపారు. అది అత్యంత పాఠకారదణను పొందింది. నాటి నల్గొండ జిల్లా భువనగిరిలో జన్మించిన భానుమూర్తి, గత అర్థ శతాబ్దకాలంగా తెలంగాణ మాండలిక భాషను తన శ్వాసగా చేసుకుని ప్రయాణాన్ని సాగించారు. అనేక పత్రికలలో తన హాస్య రసధార నిరంతయారంగా కొనసాగింది. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక విషయాలపై మంచి అవగాహన కలిగిన రచయితగా పేరు తెచ్చుకున్నారు. అతని రచనా శైలితో పాఠకులను ఆకట్టుకున్నారు. మంచి మనిషిగా, స్నేహశీలిగా అందరితో కలివిడిగా తిరిగిన భానుమూర్తి ప్రగతిశీల భావాలు కలిగిన రచయిత. వీరు మన నుండి దూరం కావడం బాధాకరం. వారి మృతికి ‘దర్వాజ’ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నది.
తెలిదేవర భానుమూర్తికి నివాళులు
- Advertisement -
- Advertisement -



