నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో రాగల రెండురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, బుధవారం నుంచి వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. మంగళవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. గడిచిన 24గంటల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.