యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

నవతెలంగాణ – హైదరాబాద్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. సివిల్స్ ఫలితాలతో పాటు ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) ఫలితాలను కూడా నేడు విడుదల చేశారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షను యూపీఎస్సీ ఈ ఏడాది మే 28న దేశవ్యాప్తంగా నిర్వహించింది. ఈ వడపోత పరీక్షలో 14,624 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరంతా సెప్టెంబరు 15న జరిగే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. ప్రిలిమ్స్ అభ్యర్థులు తమ ఫలితాలను upsc.gov.in వెబ్ సైట్లో చూసుకోవచ్చు. కాగా, ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని యూపీఎస్సీ వెల్లడించింది. డీటెయిల్డ్ అప్లికేషన్ ఫారం-1 (డీఏఎఫ్-1)లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీనికి సంబంధించిన గడువు తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

Spread the love