రైతులను పరామర్శించిన విహెచ్‌

– భువనగిరి జైలు వద్ద నిరసన
– ఎట్టికేలకు అనుమతించిన జైలు అధికారులు
నవతెలంగాణ – భువనగిరి
రీజనల్‌ రింగ్‌ రోడ్‌ అలైన్మెంట్‌ మార్చాలని గత కొద్ది కాలంగా శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే అక్రమ కేసులు బనాయించి రైతులను 14 రోజుల రిమాండ్‌ భువనగిరి సబ్‌ జైలులో వేశారు. గురువారం భువనగిరికి పీసీసీమాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు, టీపీసీసీ మైనార్టీ మాజీ అధ్యక్షులు కాజా ఫక్రుద్దీన్‌ వచ్చారు. రైతులను పరామర్శించడానికి భువనగిరి సబ్‌ జైలు వద్దకు వచ్చారు. జైలు అధికారులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో సబ్‌ జైలు వద్దనే 40 నిమిషాల పాటు శాంతియుతంగా విహెచ్‌ ధర్నా చేశారు. అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ధర్నా కాస్త ఉధృతం మారుతుండడంతో స్పందించిన అధికారులు లోనికి అనుమతించారు. రైతులను కలిసిన అనంతరం ఆయన విలేకరుల తో మాట్లాడారు. వెంటనే భేషరతుగా రైతులను విడిచిపెట్టాలని కోరారు. వారిపై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. అలైన్‌మెంట్‌ మార్చాలని లేకపోతే భూములు కోల్పోతున్న రైతుల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమానికి పూనుకుంటామని హెచ్చరించారు ఒక్క రాయగిరి గ్రామంలోని రైతులు మూడుసార్లు వివిధ రూపంలో భూములు కోల్పోవడం బాధాకరమన్నారు. రైతులకు మేలు జరిగే విధంగా మార్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి పోత్నాక్‌ ప్రమోద్‌ కుమార్‌ పట్టణ అధ్యక్షులు బిస్కుంట్ల సత్యనారాయణ రైతు కుటుంబీకులు పాల్గొన్నారు.

Spread the love