సంచలనం రేపుతున్న విశాఖ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు

నవతెలంగాణ – విశాఖ: విశాఖ కానిస్టేబుల్ రమేష్ కుమార్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖ వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బర్రి రమేష్‌ కుమార్‌ భార్య శివాని (శివజ్యోతి)తో కలిసి ఎంవీపీ కాలనీలో ఉంటున్నారు. ఈ నెల ఒకటో తేదీన విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన రమేష్‌ తెల్లవారేసరికి గుండెపోటుతో మృతి చెందాడంటూ భార్య ఎంవీపీ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ మల్లేశ్వరరావు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేశారు. తాము అన్యోన్యంగానే ఉంటున్నామని ఆమె కొన్ని వీడియోలను పోలీసులకు చూపించింది. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో ఊపిరాడక పోవడం వల్ల మృతి చెందినట్లు తేలింది. తమదైన శైలిలో పోలీసులు ఎంక్వైరీ చేయడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి. రమేష్‌ హత్యకు ప్రియుడు రామారావుతో కలిసి శివానీ ప్లాన్ చేసింది. ఆమె తన దగ్గరున్న బంగారం రూ.1.50 లక్షలకు అమ్మి.. వెల్డింగ్‌ పనులు చేసే నీలాకు సుపారీ ఇచ్చారు. ఒకటో తేదీ రాత్రి రమేష్‌ ఇంటికి వచ్చి అన్నం తిని నిద్రపోయాడు. అనంతరం నీలాను పిలిచారు.. ఇక రమేష్‌ ముఖంపై నీలా దిండు పెట్టి గట్టిగా పట్టుకోగా, కదలకుండా శివానీ కాళ్లు పట్టుకొని ప్రాణాలు తీశారు. రామారావు ఇంటి బయట ఎవరూ రాకుండా చూశాడు. అయితే, ఎదురింట్లో ఉంటున్న రామారావుతో శివానీ అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు విచారణలో తేలింది. ఏడాదిన్నరగా వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది.. వీరిద్దరూ సన్నిహితంగా ఉండటం గమనించిన రమేష్‌.. ఓసారి రామారావుతో గొడవ పెట్టుకున్నట్లు ఒప్పుకున్నారు. అనంతరం రామారావు, శివానీకొన్ని రోజులు బయటకు వెళ్లిపోయారు. ఇరు వర్గాల కుటుంబీకులు రమేష్‌కు నచ్చజెప్పి శివానీని ఇంటికి తీసుకొచ్చారు. అయినా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతునే ఉన్నాయి. దీంతో రామారావు దగ్గరికే వెళ్లిపోవాలని శివానీని రమేష్‌ మండిపడేవాడు. పిల్లలను తీసుకొని వెళ్తానని వాదించడంతో ఇద్దరి మధ్య తరచూగా గొడవ జరుగుతుండేది. భర్తను హత్య చేసి దాన్ని సాధారణ మృతిగా చిత్రీకరించి ఉద్యోగం ద్వారా వచ్చే అన్ని ప్రయోజనాలు పొందాలని శివానీ చూసింది. డబ్బుతో పాటు ఉద్యోగం కూడా వస్తుందని ఆమె అనుకుంది. అనంతరం రామారావుతో కలిసి ఉండాలనుకుంది. హత్యాకేసులో ఏ1గా శివానీ, ఏ2గా రామారావు, ఏ3గా నీలాపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చాగా వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది.

Spread the love