మద్రాస్ హైకోర్టు తీర్పును స్వాగతించిన ఐద్వా
న్యూఢిల్లీ : భర్త సంపాదించే అన్ని ఆస్థుల్లోనూ భార్యకు సగ భాగం ఉంటుందని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) స్వాగతించింది. కుటుంబం కోసం కష్టపడి, ఉద్యోగావకాశాలను త్యాగం చేసేది గృహణి అని తీర్పు తెలిపిందని ఐద్వా పేర్కొంది. భర్త సంపాదిస్తున్న సమయంలో ఇంట్లో ఉంటున్నా.. ఆయన సంపాదించిన అన్ని ఆస్తుల్లో నూ 50 శాతం వాటాకు భార్య అర్హురాలని జస్టిస్ కృష్ణ రామాస్వామి ఇచ్చిన తీర్పు సంపాదించే భర్త ఇంటికి ఎంత అవసరమో.. గృహణి కూడా అంతే అవసరమని గుర్తించిందని ఐద్వా హర్షం వ్యక్తం చేసింది.
హైకోర్టు తీర్పు ఇచ్చిన కేసులో భర్త 1983 నుంచి 1994 వరకూ ఉపాధి కోసం భారత్ నుంచి అబుదాబి వెళ్లారు. భార్య దేశంలోనే ఉండి కుటుంబాన్ని, ముగ్గురు పిల్లల్ని చూసుకునేది. ఇందు కోసం తన ట్యూటర్, టైలర్ పని కూడా మానివేసింది. భర్త సంపాదించి పంపిన నగదును జాగ్రత్త చేసి, తన అభరణాలు తాకట్టు పెట్టి మొత్తంగా నాలుగు ఆస్థులను కొనుగోలు చేసింది. అయితే అబుదాబి నుంచి తిరిగి వచ్చిన భర్త తన ఆస్థులను స్వాధీనం చేసుకున్నాడు. భార్య తనకు ఏజెంట్ మాత్రమేనని, ఆస్థుల్లో ఆమెకు ఏ మాత్రం వాటా చెందదని వాదించాడు. ఈ కేసులో హైకోర్టు పై విధంగా తీర్పు ఇచ్చింది. భార్య లేదా భర్త ఎవరి పేరు మీద ఆస్తులు కొన్నా అవి ఉమ్మడి ప్రయత్నాలు మీద మాత్రమే కొనగలరని హైకోర్టు తెలిపింది. ఐద్వా ఈ తీర్పును స్వాగతించింది. కుటుంబానికి భార్య, భాగస్వామి సమాన సహకారాన్ని గుర్తించే చట్టం కోసం గత 15 ఏండ్లుగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఐద్వా గుర్తు చేసింది. అలాగే ఇంటిలోనే మహిళకు న్యాయం జరిగిలే చట్టాన్ని ఐద్వా మరోసారి డిమాండ్ చేసింది.
భర్త ఆస్తుల్లో భార్యకు సమాన వాటా
3:03 am