నారా లోకేశ్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత

నవతెలంగాణ – అమరావతి: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఆర్పీఎఫ్‌ (వీఐపీ వింగ్‌) బలగాలతో జెడ్‌ కేటగిరీ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది. మావోయిస్టు హెచ్చరికలు, యువగళం పాదయాత్రలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలు, నిఘావర్గాల సమాచారం మేరకు భద్రతను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 22 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో నిరంతరం భద్రత కల్పిస్తారు. వీరిలో నలుగురైదుగురు ఎన్‌ఎస్‌జీ కమాండోలు ఉంటారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లోకేశ్‌ భద్రతను తగ్గించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ జెడ్‌ కేటగిరీ కల్పించాలని చేసిన సిఫార్సులను పక్కనపెట్టి వై కేటగిరీ భద్రతను ఇచ్చింది. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేసిందని.. లోకేశ్‌కు తగిన భద్రత కల్పించాలని కోరుతూ ఆయన భద్రతా సిబ్బంది పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్‌, హోంశాఖలకు లేఖలు రాశారు.

Spread the love