ఎమ్మెల్యే కారును ఢీకొన్న బైక్.. ఒకరు మృతి

నవతెలంగాణ – అమరావతి: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తలకొండపల్లి మండలంలోప్రచారం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారును రాంగ్ రూట్ లో వచ్చిన బైక్ ఢీకొనగా, ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెల్జాల్ గ్రామంలోని ప్రచారం ముగించుకున్న అనంతరం ఎమ్మెల్యే మిడ్జిల్ మండల కేంద్రం మీదుగా చారకొండ మండలానికి బయలుదేరారు. వెల్జాల్ గ్రామ సమీపంలోని రామాసిపల్లి మైసమ్మ టెంపుల్ క్రాస్ రోడ్డు వద్ద ఎదురుగా రాంగ్ రూట్ లో వచ్చిన బైకు ఢీ కొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల గాను ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు పేర్కొన్నారు.
బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన సురేష్ , రాములు అని తెలిసింది. గాయపడ్డ ఇద్దరిని అంబులెన్స్ లో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం ఇంకా పూర్తిగా తెలియవలసి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే కారు సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి రోడ్డు దిగి పక్కన ఉన్న చెట్లపొదల్లోకి వెళ్లినట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే కాలుకు కూడా చిన్నపాటి గాయమైనట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు లో ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే సీట్ బెల్ట్ ధరించి ఉండడం, కారు డ్రైవర్ సడెన్ బ్రేకులు వేయడంతో కారులో ఉన్న బెలూన్స్ ఓపెన్ కావడంతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తో పాటు కారులో ఉన్న గన్మెన్లు, పీఏ అందరూ ప్రాణాపాయం నుంచి బయట పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Spread the love