నవతెలంగాణ – హైదరాబాద్
వివేకానంద హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. శనివారం ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించి రెండు బ్లాకులు గుర్తించినట్టు వెల్లడించారు. లక్ష్మమ్మకు కటింగ్ బలూన్ యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స నిర్వహించి కుడి గుండె కవాటంలో రెండు స్టంట్లు అమర్చినట్టు చెప్పారు. ఆపరేషన్ తరువాత ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. లక్ష్మమ్మను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని హెల్త్ బులిటెన్లో వెల్లడించారు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను హైదరాబాద్కు తరలించిన విషయం తెలిసిందే.