– బీజేపీ నేతలకు మంత్రి పొన్నం ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఓట్ల కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాముని కల్యాణం తర్వాత అక్షింతలు వస్తాయా? కళ్యాణానికి ముందే వస్తాయా? అని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. రాముని విగ్రహాలు, ఫోటోలు పెట్టి బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్, శ్రీనివాస్తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతుందనే అక్కసుతో ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయని ఆ పార్టీకి తెలంగాణ ప్రజలు ఓట్లు వేయబోరని చెప్పారు. ‘దేవుడు గుడిలో ఉండాలి…భక్తి గుండెల్లో ఉండాలి’ అన్నారు. కాంగ్రెస్ హయాంలో హనుమన్ చాలిసా చదవలేదా? అంటూ బీజేపీ నేతలను ప్రశ్నించారు.