‘కాలింగ్ బెల్, రాక్షసి’ వంటి హర్రర్ మూవీస్ని డైరెక్ట్ చేసిన పన్నా రాయల్ దర్శకత్వ పర్య వేక్షణలో డి.ఎం. యూనివర్సల్ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘ప్లాంట్ మాన్’. చంద్రశేఖర్, సోనాలి జంటగా కె.సంతోష్బాబు దర్శకత్వంలో రూపొందిన సైంటిఫిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందుతూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో తమ చిత్రానికి మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కతజ్ఞతలు తెలిపేందుకు చిత్ర యూనిట్ సక్సెస్మీట్ని నిర్వహించింది. ఈ మీట్లో చంద్రశేఖర్, సోనాలి, నిర్మాత పన్నా రాయల్, దర్శకుడు కె.సంతోష్బాబు, బేబి ప్రేక్షిత, అక్కం బాలరాజు, అశోక్వర్థన్, రచయిత సాయికష్ణ, తడివేలు, బాలరాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత పన్నా రాయల్ మాట్లాడుతూ, ‘ఈరోజు మా గురువు బి.ఎ.రాజు జయంతి. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆశీస్సులు ఉంటాయి. డైరెక్టర్గా నేను అందరికీ పరిచయమే. నిర్మాతగా నేను చేసిన మొదటి సినిమా ఇది. ఒక చిన్న సినిమాగా స్టార్ట్ చేశాం. కానీ, రిజల్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంది. ఇంత పెద్ద సక్సెస్ నేను ఊహించలేదు. ఇలాంటి రెస్పాన్స్ వస్తే సంవత్సరానికి రెండు చిన్న సినిమాలు చేసి కొత్త వారిని ఇంట్రడ్యూస్ చేయాలని ఉంది’ అని అన్నారు. ‘మా ఈ చిన్న సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సినిమా చేయడానికి నిర్మాత పన్నా రాయలే కారణం’ అని దర్శకుడు కె.సంతోష్బాబు చెప్పారు. హీరో చంద్రశేఖర్ మాట్లాడుతూ, ‘పన్నా కొత్తవారిని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ సంక్రాంతికి కుటుంబ సమేతంగా చూసి చూడదగ్గ సినిమా ఇది’ అని చెప్పారు. మంచి సినిమాలో నేను కూడా భాగమైనందుకు సంతోషంగా ఉంది. సినిమా థియేటర్లలో రన్ అవుతోంది. తప్పకుండా చూడండి’ అని సోనాలి అన్నారు.