వన్డే క్రికెట్‌లో మరో విధ్వంసకర డబుల్‌ సెంచరీ..

నవతెలంగాణ – హైదరాబాద్: వన్డే క్రికెట్‌లో మరో విధ్వంసకర డబుల్‌ సెంచరీ నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక మెరుపు ద్విశతకంతో (139 బంతుల్లో 210 నాటౌట్‌; 20 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. కేవలం 136 బంతుల్లోనే డబుల్‌ సెంచరీ మార్కును చేరిన నిస్సంక.. వన్డేల్లో మూడో వేగవంతమైన డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో క్రిస్‌ గేల్‌ (138 బంతుల్లో), వీరేంద్ర సెహ్వాగ్‌ (140 బంతుల్లో) లాంటి అరివీర భయంకరుల రికార్డులను అధిగమించాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ రికార్డు టీమిండియా ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ పేరిట ఉంది. 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్‌ కేవలం​ 126 బంతుల్లోనే డబుల్‌ బాదాడు. రెండో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ రికార్డు ఆసీస్‌ ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (128) పేరిట ఉంది. తాజా డబుల్‌ సెంచరీతో నిస్సంక మరిన్ని రికార్డులు నమోదు చేశాడు. వన్డేల్లో డబుల్‌ నమోదు చేసిన తొలి శ్రీలంక ఆటగాడిగా, ఓవరాల్‌గా 12వ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. నిస్సంకకు ముందు రోహిత​ శర్మ, మార్టిన్‌ గప్తిల్‌, సెహ్వాగ్‌, క్రిస్‌ గేల్‌, ఫకర్‌ జమాన్‌, ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌, మ్యాక్స్‌వెల్‌, సచిన్‌ టెండూల్కర్‌ వన్డేల్లో డబుల్‌ మార్కును తాకారు.
     మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. నిస్సంక విధ్వంసకర ద్విశతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 381 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. నిస్సంకతో పాటు మరో ఓపెనర్‌ అవిష్క ఫెర్నాండో (88), సమరవిక్రమ (45) రాణించారు. నిస్సంక ఊచకోత ధాటికి ప్రపంచలోకెల్లా మెరుగైన స్పిన్‌ అటాక్‌ కలిగిన ఆఫ్ఘన్లు చిగురుటాకుల్లా వణికిపోయారు.

Spread the love