మీ ఓటు మంచివాళ్లక.. ముంచేవాళ్లకా : బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆశన్న గారి జీవన్ రెడ్డి

నవతెలంగాణ- ఆర్మూర్ :  మీ ఓటు మంచి వాళ్లకు, ముంచేవాళ్లక అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఇచ్చే తాగు సాగునీరు కావాలా?, కాంగ్రెస్ ఇచ్చే కన్నీరు, బీజేపీ మొసలి కన్నీరు కావాలా?. అని బీఆర్ఎస్ అభ్యర్థి, ఆ పార్టీ  జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రజలనడిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆర్మూర్ పట్టణంలోని (టీచర్స్ కాలనీ) 10, 29 వార్డులో  పెద్ద ఎత్తున ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ నిర్వహించారు. జీవన్ రెడ్డి ఇంటింటికి వెళ్లి మళ్లీ కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను గెలిపించాలని  కోరుతూ జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఆయనకు పట్టణ  ప్రజలు అడుగడుగునా బ్రహ్మ రథం పట్టారు. డప్పు,వాయిద్యాలు,మేళ తాళ్లాలతో ప్రజలు మంగళ హారతులు పట్టారు. మహిళలు బోనాలతో, యువకులు బైక్ ర్యాలీలతో కేరింతలు కొడుతూ తమ అభిమాన నేతకు ఘనంగా స్వాగతం పలికి పూలవాన కురిపించారు.  జై జీవనన్న, జై కేసీఆర్ నినాదాలతో ఆర్మూర్ వార్డులన్నీ దద్దరిల్లాయి.ఈ సందర్భంగా జరిగిన ప్రజాశీర్వాద బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ ఆయా వార్డుల  ప్రగతి నివేదికలను ప్రజల ముందు ఉంచి  మరోసారి గెలిపించాలని కోరారు.  మళ్లీ మన ప్రభుత్వం అధికారం లోకి రాగానే ఆసరా పెన్షన్లు రూ.5 వేలకు, వికలాంగుల పెన్షన్లు రూ.6వేలకు, రైతు బంధు నిధులు ఎకరాకు రూ.10వేల నుంచి రూ.16వేలకు పెరుగుతాయి. సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ. 3వేల భృతి వస్తుంది. రూ.400కే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా జరుగుతుంది. రూ.5లక్షల చొప్పున ఇంటింటికి బీమా కేసీఆర్ ధీమా పథకం అమలు కానుంది అని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్మూరు పట్టణంలో ఎవరూ ఊహించని అభివృద్ధి జరిగింది. పదేళ్ల క్రితం మురికికూపంలా కనిపించిన ఆర్మూర్ టౌన్ నేడు అభివృద్ధి కాంతులతో వెలుగుతుంది. అభివృద్ధిలో ఆర్మూరు ఫస్ట్. నాడు గతుకుల రోడ్లు, నేడు బతుకు చిత్రం మార్చిన తళతళ మెరిసే రోడ్లు దర్శనమిస్తున్నాయి.
ప్రతీ ఎకరాకు సాగునీరు, ప్రతీ ఇంటికి తాగునీరు అందిస్తున్నాం. ఆర్మూర్ కే తలమానికం నూరు పడకల ఆసుపత్రి. పట్టణానికి వన్నె తెచ్చిన ఆభరణాలు  బైపాస్ రోడ్లు. సకల కులాలకు ఫంక్షన్ హాళ్లు నిర్మించాం. పెర్కిట్ చెరువు, రెడ్డిచెరువుల్లో  కాలుష్యనివారణ పనులు,  మోడ్రన్ ధోబీఘాట్, గుండ్లచెరువు టూరిజం అభివృద్ధి పనులు, వెజ్-నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం పనులు,  కోట్లాది రూపాయల వ్యయంతో ఆర్మూర్ పట్టణంలో సిద్ధులగుట్ట ఘాట్ రోడ్డు,  అంబేద్కర్ చౌరస్తా సుందరీకరణ, డివైడర్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టుకున్నాం అని ఆయన వివరించారు. కాంగ్రెస్ వస్తే కరెంటు, రైతు, దళిత, బీసీ, గిరిజన బంధు రద్దవుతాయి. బీజేపీ, కాంగ్రెస్ లకు ఓట్లు వేస్తే తెలంగాణకు మళ్లీ పాట్లు తప్పవు. మీ ఓటు మంచివాళ్ళకు వేస్తారా?. లేక  మందిని ముంచే వాళ్లకు వేస్తారా?. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్, బీజేపీలను తరిమికొట్టాలి. ప్రజలు ఆలోచించి  కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ కు వ్యతిరేకంగా, కేసీఆర్ గారిచ్చే 24గంటల ఉచిత విద్యుత్ కు మద్దతుగా ఓటెయ్యాలి.  పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు చేసే కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్  పథకాలు మనకు కావాలి. ఈ పథకాలను రద్దు చేయాలని చూస్తున్న కాంగ్రెస్, బీజేపీ లనే మన ఓటు ద్వారా తరిమికొడదాం. ఆర్మూర్ అభివృద్ధి మరింత వేగంగా పరుగులు పెట్టాలంటే మనం కారు గుర్తుకు ఓటేద్దాం. తెలంగాణ కు ఎలాంటి కష్టం రావద్దంటే ఊరూ వాడ ఏకమై మూడోసారి కూడా ” కారు, సారు, కేసీఆర్” అని కదం తొక్కాలి అని జీవన్ రెడ్డి అన్నారు. నేను మీ కంటి ముందు పుట్టి పెరిగిన మీ బిడ్డను. మీ కడుపులో తలపెట్టి అడుగు తున్న మళ్లీ నన్ను ఆశీర్వదించండిఅని జీవన్ రెడ్డి అర్ధించారు. ఈ కార్యక్రమంలో    నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love