చెక్కేస్తున్న సంపన్నులు

– భారత్‌ను వీడిన 6500 మంది
– దుబారు, సింగపూర్‌కు ప్రాధాన్యత
న్యూఢిల్లీ : భారత్‌లోని సంపన్నులు దేశాని వీడిపోతున్నారు. 2023లో 6,500 మంది మిలియనీర్లు విదేశాలకు వెళ్లిపోయారని హెన్లే ప్రయివేటు వెల్త్‌ మైగ్రోనేషన్‌ రిపోర్ట్‌-2023లో వెల్లడయ్యింది. గత సంవత్సరం 7,500 మంది వీడిన వారితో పోల్చితే కొంచెం తక్కువగా ఉంది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా సంపద, పెట్టుబడుల ప్రవాహల ట్రెండ్స్‌ను అధ్యయనం చేస్తుంది. మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.8 కోట్ల) పైన సంపద కలిగి విదేశాలకు తరలిపోయిన వారితో ఈ రిపోర్ట్‌ను రూపొందించింది. అత్యధికంగా దేశం వీడిన సంపన్నుల జాబితాలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. చైనా నుంచి అత్యధికంగా 13,500 ఆ దేశాన్ని వీడారు. బ్రిటన్‌ నుంచి 3,200 మంది, రష్యా నుంచి 3,000 మంది చొప్పున వెళ్లిపోయారు.”ఇటీవల చోటు చేసుకుంటున్న నిరంతర గందరగోళం ఒక మార్పుకు కారణం. భద్రత నుండి విద్య, ఆరోగ్య సంరక్షణ నుంచి వాతావరణం వరకు అనేక కారణాల వల్ల ఎక్కువ మంది పెట్టుబడిదారులు తమ కుటుంబాలను మార్చాలని ఆలోచిస్తున్నారు. పెట్టుబడిదారులు ప్రపంచ అస్థిరతలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో అంతిమ రక్షణను ప్రాధాన్యతగా భావిస్తూ తరలిపోతున్నారు.” అని హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌లోని ప్రయివేటు క్లయింట్‌ల గ్రూప్‌ హెడ్‌ డొమినిక్‌ వోలెక్‌ పేర్కొన్నారు.
భారత్‌లో నిషేధిత పన్ను చట్టాలు, రెమిటెన్స్‌లకు సంబంధించిన క్లిష్ట విధానాలు వలసల ధోరణిని ప్రేరిపిస్తున్నాయి. సంపన్న భారతీయ కుటుంబాలకు దుబారు, సింగపూర్‌ దేశాలు స్వర్గదామంగా కనబడుతున్నాయి. ఈ రెండు దేశాలు భారతీయ సంపన్నులకు ఇష్టమైన గమ్యస్థానాలుగా నిలుస్తున్నాయి. అక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ ”గోల్డెన్‌ వీసా” ప్రోగ్రామ్‌, అనుకూలమైన పన్ను వాతావరణం, బలమైన వ్యాపార పర్యావరణ వ్యవస్థ, సురక్షితమైన, శాంతియుత వాతావరణం ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
గ్లోబల్‌ వెల్త్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ న్యూ వరల్డ్‌ వెల్త్‌ 2031 నాటికి భారత్‌లో సంపన్నుల జనాభా 80 శాతం పెరుగొచ్చని అంచనా. ” దేశంలో నివసిస్తున్న సుమారు 3.57 లక్షల మంది సంపన్నులతో భారత్‌ బలమైన సంపద ఉనికిని ప్రదర్శిస్తోంది. ఆసియా వివిధ సంపద కేంద్రాలకు నిలయంగా ఉంది. భారతీయ పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ నివాసాలు, అదనపు పౌరసత్వాల కోసం ఈ సంవత్సరం కూడా దేశాన్ని వీడే వారి సంఖ్య కొనసాగనుంది.” అని హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ ఇండియా ప్రయివేటు లిమిటెడ్‌ క్లయింట్స్‌ డైరెక్టర్‌ రోహిత్‌ భరద్వాజ్‌ అన్నారు. పోర్చుగల్‌ గోల్డెన్‌ రెసిడెన్స్‌ పర్మిట్‌ ప్రోగ్రామ్‌ 2023లో అత్యంత ప్రజాదరణ పొందింది. కెనడా స్టార్టప్‌ వీసా ప్రోగ్రామ్‌ తదుపరిగా ఉంది.

Spread the love