అవార్డుల ప్రదానోత్సవంలో అపశ్రుతి

– మహారాష్ట్ర లో ఎండ వేడికి తట్టుకోలేక 8 మంది మృతి
– అమిత్‌ షా ఉన్న సభలోనే పిట్టల్లా రాలిన జనం..
– సరైన ఏర్పాట్లు చేయని శిండే సర్కార్‌
ముంబయి: మహారాష్ట్ర భూషణ్‌-2022 అవార్డు ప్రదానోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎండ వేడిమి భరించలేక 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది వడదెబ్బకు గురయ్యారు. వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే వెల్లడించారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత సీఎం శిండే ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నవీ ముంబయిలో మహారాష్ట్ర భూషణ్‌-2022 అవార్డు ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక కార్యకర్త దత్తాత్రేయ నారాయణ్‌కు అవార్డును ప్రదానం చేశారు. అయితే, మిట్ట మధ్యాహ్నం కార్యక్రమం నిర్వహించడంతో అవార్డుల ప్రదానోత్సవానికి వచ్చిన పలువురు సామాజిక కార్యకర్తలు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవ్వడంతో వేడి భరించలేక ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఆదివారం నవీ ముంబయిలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
పై కప్పులేకుండా …
అవార్డుల ప్రదానోత్సవానికి వచ్చిన వారికోసం సిట్టింగ్‌ ఏర్పాట్లు చేసినప్పటికీ.. పైకప్పు లేకపోవడంతో ఎండ తీవ్రతను భరించలేక అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అంతేకాకుండా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.

Spread the love