ఆస్తుల విభజనపై కౌంటర్‌ దాఖలు చేయండి

 తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు ఆదేశం
 నాలుగు వారాలు గడువు
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనకు సంబంధించి విశ్రాంత న్యాయమూర్తితో కమిటీ వేయాలని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కేంద్రం అభిప్రాయం తెలుసు కున్న సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పరిశీలి స్తామని పేర్కొంది. రూ.1,42,601 కోటకు సంబంధించి ఆస్తుల విభజనపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్‌ జెకె మహేశ్వరి, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. గత విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చి ఐదు నెలలు గడిచినా తెలంగాణ ప్రభుత్వం ఇంకా కౌంటరు దాఖలు చేయలేద న్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించగలదా అని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) నటరాజన్‌ను అడిగిన ధర్మాసనం, కౌంటరు ఎందుకు దాఖలు చేయలేదని తెలంగాణ తరపు న్యాయవాదిని ప్రశ్నిం చింది. చివరి అవకాశంగా నాలుగు వారాలు గడువు ఇవ్వాలని తెలంగాణ న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఆస్తుల విభజన విభజన చట్టంలోని అంశమని, విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9,10ల్లో ఉన్న సుమారు రూ.1.42 లక్షల కోట్లు విభజించకపోవడం సరికాదని సింఘ్వి పేర్కొన్నారు.
ఉద్యోగుల విభజనపై జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ నియమించినట్టు ఈ వ్యవహారంపైనా విశ్రాంత న్యాయమూర్తితో కమిటీ నియమించాలని కోరారు. ఆ విధంగా చేయొచ్చా అని నటరాజన్‌ను ధర్మాసనం ప్రశ్నించగా.. చేసే అవకాశం ఉందని ఏఎస్‌జీ సమాధానమి చ్చారు. వాదనల అనంతరం నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. రిజాయిండర్‌ దాఖలకు రెండు వారాలు గడువిచ్చిన ధర్మాసనం తదుపరి విచారణ జులై చివరి వారానికి వాయిదా వేసింది. విభజన జరగాల్సిన 91శాతం ఆస్తులు హైదరాబాద్‌లోనే ఉన్నాయని ఏపీ తెలిపింది. ఎనిమిది ఏండ్లయినా ఆస్తుల విభజనకు తెలంగాణ సహకరించడం లేదని ఏపీ వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 21 ప్రకారం ఏపీ ప్రజల హక్కులకు తెలంగాణ భంగం కలిగించిందంటూ పిటిషన్‌లో పేర్కొంది. ఆస్తుల విభజన త్వరగా జరిగేలా ఆదేశాలివ్వాలని సుప్రీంను ఏపి కోరింది.

Spread the love