నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ధాన్యంలో 17 శాతంపైగా తేమ ఉంటే కొనుగోలుకు కేంద్ర నిబంధనలు అడ్డుగా ఉన్నాయని పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి జాప్యానికి ఆస్కారం లేకుండా 7,175 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గతేడాది కన్నా 7.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలు చేసినట్టు స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన 19.62 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 18.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే రైస్ మిల్లులకు తరలించినట్టు పేర్కొన్నారు.