– ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలి
– అన్ని సొసైటీల్లో ఏకరూప పరిపాలన అమలు చేయాలి
– విద్యార్థుల మెస్ చార్జీల పెంపు ఉత్తర్వులివ్వాలి : టీఎస్యూటీఎఫ్ గురుకుల టీచర్ల రాష్ట్ర సదస్సు డిమాండ్
– సమస్యల పరిష్కారానికి ఐక్యఉద్యమాలే మార్గం : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
c ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని, కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరింది. అన్ని సొసైటీల్లోనూ ఏకరూప పరిపాలన అమలు చేయాలని సూచించింది. విద్యార్థుల మెస్ చార్జీల పెంపు ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఉపాధ్యాయులకు శ్రమకు తగిన వేతనాలు (పారిటీ స్కేల్స్) అమలు చేయాలని కోరింది. గురుకుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీ పోరాట కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ఆగస్టు ఐదో తేదీన హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించింది. టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో సంక్షేమ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సును బుధవారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థలు నాణ్యమైన విద్యకు విజయవంతమైన నమూనాగా ఉన్నాయని చెప్పారు. గురుకుల విద్యార్థులు సాధించిన విజయాల వెనుక ఉపాధ్యాయుల శ్రమ, అంకితభావం అంతర్లీనంగా ఉందన్నారు. వారి శ్రమను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరముందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన గురుకులాలకు వెంటనే శాశ్వత భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల మెస్ చార్జీలు 25 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పాఠశాలల ప్రారంభం నాటికే ఉత్తర్వులివ్వాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలే మార్గమని చెప్పారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ గురుకుల ఉపాధ్యాయులు పాఠ్యబోధనతోపాటు హౌజ్ మాస్టర్, కేర్టేకర్, డిప్యూటీ వార్డెన్, సూపర్వైజరీ స్టడీస్, నైట్ స్టే, ఎస్కార్ట్ తదితర ఎన్నో విధులను నిర్వహిస్తున్నారని అన్నారు. 24×7 పనిచేస్తూ విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుతున్నారని చెప్పారు. అయినా ఉపాధ్యాయుల శ్రమకు తగిన వేతనం గానీ, కష్టానికి తగిన గుర్తింపుగానీ లభించటం లేదన్నారు. నిర్వహణలో ఏమాత్రం తేడావచ్చినా కఠిన శిక్షలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు శారీరక శ్రమతో పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు. వారిపై బోధనేతర పనుల భారం తగ్గించాలని, స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక్కో సొసైటీలో ఒక్కో రకంగా పరిపాలన, ఆజమాయిషీ కొనసాగుతున్నదని చెప్పారు. బోధనా సమయాల్లో సైతం ఏకరూపత లేదన్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయులతోపాటు సమాన సంఖ్యలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, గెస్ట్, పార్ట్ టైం టీచర్లు పనిచేస్తున్నారని వివరించారు. వారికి కనీస వేతనాలు లభించటం లేదన్నారు. ఈ క్రమంలో గురుకుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీ పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ కోశాధికారి టి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సింహాచలం, గురుకుల ఉపాధ్యాయుల ప్రతినిధులు సృజన, ఎల్లయ్య, రాంబాబు, మహేష్, లివిన్ స్టన్, రామకృష్ణ, దామోదర్, శ్రీనివాస్, ఆంజనేయులు, అబిద్ పాషా, నరసింహ, అరుణా దేవి, రాజశ్రీ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
దశలవారీ కార్యాచరణ
జూన్ 13 నుంచి 17 వరకు అన్ని సొసైటీల కార్యదర్శులకు, మంత్రులకు చార్టర్ ఆఫ్ డిమాండ్లతో కూడిన నోటీసులను సమర్పించాలి.
జూన్ 26/27 తేదీల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలి. భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలి.
జులై 17న జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు
ఆగస్టు 5న హైదరాబాద్ లో మహాధర్నా