మనిషి ఆయుష్షు నేపథ్యంలో..

తాను హీరోగా నటిస్తూ, నిర్మించిన ‘అనంత’ చిత్రానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌ నుంచి వచ్చే ప్రతి రూపాయి (థియేటర్‌ ఖర్చులు పోను) ఇటీవల ఒరిస్సాలో ప్రమాదానికి గురైన ‘కోరమండల్‌’ ఎక్స్‌ప్రెస్‌ బాధితుల కుటుంబాల సహాయ నిధికి ఇవ్వనున్నామని ప్రశాంత్‌ కార్తీ తెలిపారు. గతంలో రామ్‌చరణ్‌ ‘దృవ’, ‘చెక్‌’, రాంగోపాల్‌వర్మ ‘కొండా’ చిత్రాలలో నటించిన ప్రశాంత్‌ కార్తీ తాజాగా శ్రీనేత్ర క్రియేషన్స్‌ పతాకంపై ‘అనంత’ చిత్రాన్ని నిర్మించారు. ఆయన సరసన రిత్తిక చక్రవర్తి నటించగా, అనీష్‌ కురువిళ్ళ, లయ సింప్సన్‌, శ్రీనివాస్‌ జె గడ్డం, రమేష్‌.కే, అనిల్‌ కుమార్‌, కీర్తి ప్రధాన తారాగణం.
మధు బాబు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 9న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత, హీరో ప్రశాంత్‌ కార్తీ మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
‘రామ్‌చరణ్‌ నటించిన ‘దృవ’ సినిమాలో చేసిన పోలీస్‌ క్యారెక్టర్‌ ఆ తరువాత ‘చెక్‌’, రాంగోపాల్‌ వర్మ ‘కొండా’ సినిమాలో నటించిన నక్సల్కెట్‌ నాయకుడు ఆర్‌.కె. పాత్రలు నటుడిగా నాకు మంచి గుర్తింపునిచ్చాయి. దర్శకుడు మధుబాబు చెప్పిన ఈ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లింగ్‌ కథ నచ్చడంతో ఈ సినిమాను నేనే నిర్మించాలని డిసైడ్‌ అయ్యాను. సోలో హీరోగా ఇది మొదటి సినిమా. మనిషి ఆయుష్షు నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ‘మనిషి పుట్టిన మరుక్షణం నుంచే ఆ శరీరం మరణం వైపు ప్రయాణం చేస్తుంటుంది’ అనే డైలాగ్‌ సినిమా సోల్‌ ఏంటో చెబుతుంది. ఇన్వెస్టిగేషన్‌తో పాటు థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ టచ్‌ చేస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి కంటెంట్‌ ఇండియన్‌ సినిమాల్లో ఇప్పటివరకు రాలేదు. రిలీజియన్‌ మీద ఈ కథ ఉండటంతో సెన్సార్‌ వారు మొదట అభ్యంతరం వ్యక్తం చేసి, రివిజన్‌ కమిటీకి పంపారు. తరువాత వారు చూసి ఓకే చెప్పడంతో సెన్సార్‌ వారు రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా, డిఫరెంట్‌ పాయింట్స్‌ టచ్‌ చేస్తూ చాలా బాగా తీశావని ‘యు’ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఇందులో బోల్డ్‌ కంటెంట్‌ ఉండదు. సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్న కథ కావడంతో రిస్క్‌ అయినా ఈ కథను సెలక్ట్‌ చేసుకొని సినిమా తీశాను. మనతో ఉన్నటువంటి మనిషి మాయమైతే ఆ పెయిన్‌ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే టాలీవుడ్‌ తరుపున ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ థియేటర్స్‌లో వచ్చే కలెక్షన్స్‌లో థియేటర్‌ ఖర్చులు పోను మిగిలిన ప్రతి రూపాయి ఒరిస్సాలో జరిగిన రైలు దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సహాయంగా అందిస్తాం. ఇందు కోసమే ఈ సినిమాను ఈనెల 9న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమా తరువాత రెండు ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను. దయచేసి అందరూ థియేటర్స్‌లో ఈ సినిమాను రైలు ప్రమాద బాధితుల సహాయ నిధి కోసమైనా చూడాలని కోరుకుంటున్నా. మీ టిక్కెట్‌ డబ్బులు ఆయా కుటుంబాలకు ఎంతో కొంత సహాయపడాలని ఆశిస్తున్నాను.

Spread the love