జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారిని మంగ‌ళ‌వారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు ద‌ర్శించుకున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా అలంపూర్‌ తాలూక బీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తృత స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమావేశం మంగళవారం జరిగింది. ఈ స‌మ‌వేశంలో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓడినా వెన్నంటి ఉండి ప్రోత్సహించిన నేతలు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ స‌మ‌వేశం అనంత‌రం అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారిని కేటీఆర్ ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఇక కేటీఆర్ ఆలయానికి చేరుకోగానే అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందించి.. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ.. ఎక్స్ వేదిక‌గా కేటీఆర్‌ పోస్ట్ పెట్టాడు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా అలంపూర్‌లో జోగులాంబ అమ్మవారిని ద‌ర్శించుకున్నాను. అమ్మవారి ద‌ర్శ‌నం అద్భుతంగా జ‌రిగింది. రాష్ట్రమంతటా సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని కేటీఆర్ ఎక్స్‌లో రాసుకోచ్చాడు.

Spread the love