దశాబ్ది ఉత్సవాల్లో ప్రగతి ప్రస్థానాన్ని ప్రతిబింబిద్దాం…

– లోగో ఆవిష్కరణలో సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ – హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని, దాని అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన లోగోను ఆయన సోమవారం సచివాలయంలో ఆవిష్కరించారు. కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్తు, వ్యవసాయం, మిషన్‌ భగీరథ, సాంస్కృతిక రంగాలు, యాదాద్రి వంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు, మెట్రో రైలు, టీ-హబ్‌, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం చిహ్నాలను సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు లోగోలో పొందుపరిచారు. వీటితోపాటు తెలంగాణ తల్లి, బతుకమ్మ, బోనాలు, పాలపిట్ట, అమరవీరుల స్మారకం, తెలంగాణ అస్తిత్వ చిహ్నాలతో రాష్ట్ర ఖ్యాతి మరింత ఇనుమడించేలా అది రూపుదిద్దుకున్నది.లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, పాడి కౌశిక్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, బాల్క సుమన్‌, సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్‌ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ శాంతి కుమారి, ఆర్ధికశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Spread the love