బీజేపీలో గాలి జనార్దన్ రెడ్డి పార్టీ విలీనం..

నవతెలంగాణ – హైదరాబాద్: కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష అధ్యక్షుడు, ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి ఇవాళ మళ్లీ బీజేపీలో చేరారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ) పార్టీని బీజేపీలో విలీనం చేశారు. బెంగళూరులోని బీజేపీ కార్యాలయం వేదికగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సమక్షంలో గాలి జనార్దన్ రెడ్డి కమలతీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కల్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందిన కీలక నేతలు, జనార్దన్ రెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత వారం దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన జనార్దన్ రెడ్డి, ఆ తర్వాత తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయ్యేందుకు తనవంతుగా సాయం చేస్తానని తెలిపారు. ఇందులో భాగంగానే తాజాగా తన పార్టీని బీజేపీలో విలీనం చేసి తాను కాషాయ కండువా కప్పుకున్నారు.

Spread the love