బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

నవతెలంగాణ – న్యూఢిల్లీ : బీజేపీపై న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఏడుగురు ఆప్‌ ఎమ్మెల్యేలకు రూ.25 కోట్ల చొప్పున ఎర వేసిందని ఆరోపించారు. ఎక్స్‌ వేదికగా కేజ్రీవాల్‌ పెట్టిన ఈ పోస్ట్‌ దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతోంది.” మరి కొద్ది రోజుల్లో మేం అరవింద్‌ కేజ్రీవాల్‌ని అరెస్ట్‌ చేస్తామని బీజేపీ చెబుతోంది. అంతే కాదు. మా పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు కుట్ర చేస్తోంది. రూ.25 కోట్లు ఇచ్చి వాళ్లను లాక్కోవాలని చూస్తోంది. ఆ తరవాత మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్లాన్‌ చేస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకి రూ.25 కోట్లు ఇవ్వడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో వాళ్లందరికీ బీజేపీ తరపున పోటీ చేసేందుకు కూడా ఆ పార్టీ ఆశ చూపుతోంది ” – అరవింద్‌ కేజ్రీవాల్‌ పోస్ట్‌ పెట్టారు.
అవేవీ సక్సెస్‌ కాలేదు : కేజ్రీవాల్‌
21 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టు బీజేపీ చెబుతున్నా.. తమకున్న సమాచారం ప్రకారం ఏడుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు చూస్తోందని కానీ వాళ్లంతా అందుకు అంగీకరించలేదని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. కేవలం తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మాత్రమే తనను అరెస్ట్‌ చేయాలని చూస్తున్నారని, అందుకోసం లిక్కర్‌ స్కామ్‌ని సాకుగా చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. గత 9 ఏళ్లుగా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తూనే ఉందని, కానీ అవేవీ సక్సెస్‌ కాలేదని అన్నారు. ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా నిలబడడం వల్ల అలాంటిదేమీ జరగలేదని స్పష్టం చేశారు.

Spread the love